
ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది. ఫిక్స్డ్ డిపాజిటర్లు నిర్దేశిత భాగాలతో ఎక్కువ మంది బహుళ నామినీలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్యాంకింగ్ నిబంధనలను సవరించే చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిశీలిస్తారని భావిస్తున్నారు.
ఎక్కువ మంది నామినీలను పెట్టుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను నిర్వహించే అనేక మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.
సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది డిపాజిటర్లు ఫిక్స్డ్ డిపాజిట్లను తెరిచేటప్పుడు నామినీలను పేర్కొనలేదు. దీంతో వారి మరణం తరువాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకోవడంలో వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద ఎత్తున ఎదురయ్యాయి.
ప్రతిపాదిత కొత్త నిబంధనలు
ఎకనమిక్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుత సింగిల్ నామినీ సిస్టమ్ అమలులో ఉండగా ప్రతిపాదిత సవరణలతో గరిష్టంగా నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుంది.
నామినీల ఏర్పాటు రెండు విధాలుగా ఉండవచ్చు. నామినీలకు భాగాలను పేర్కొంటూ ఒకేసారి అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా వివిధ సందర్భాల్లో నామినీలను జోడించుకునే అవకాశమైనా కల్పించవచ్చు.
ఒకేసారి నామినీలను ఏర్పాటుచేసిన సందర్భంలో డిపాజిటర్ మరణించిన తర్వాత ముందుగానే పేర్కొన్న భాగాల ప్రకారం నామినీలందరూ డిపాజిట్ సొమ్మును పొందే వీలుంటుంది. దీని వల్ల క్లయిమ్ సెటిల్మెంట్ సులభతరం కావడం మాత్రమే కాకుండా డిపాజిటర్ సొమ్ము సరైన వారసులకు దక్కే ఆస్కారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment