
అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్తో నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలను కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విధానం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే అంతర్జాతీయ రుణ సమస్యలను ఎదుర్కొనేందుకు, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జీ20 మంత్రుల సమావేశానికి ముందు అమెరికా, జపాన్, స్పెయిన్ తదితర దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలు చర్చించారు.
శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నేతలు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్, జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ షునిచి సుజుకీ తదితరులతో సీతారామన్ భేటీ అయ్యారు. సార్వభౌమ రుణాల పునర్వ్యవస్థీకరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంపై యెలెన్ అభినందించినట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
(ఇదీ చదవండి: Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?)