
న్యూఢిల్లీలో రూ.350 పెరిగి రూ.71,700కు చేరిక
అంతర్జాతీయంగా ఆల్ టైమ్ హై 2,372 డాలర్లకు అప్
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది.
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది.
వెండి కూడా...
ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment