
ఉక్కునగరం (గాజువాక): వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన లావాదేవీ సలహాదారుల (అడ్వైజర్లు) బిడ్డింగ్కు గడువును ఆగస్టు 26 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు పొడిగించడం ఇది రెండోసారి. వాస్తవానికి జూలై 28కి గడువు ముగియాల్సి ఉండగా దాన్ని తర్వాత ఆగస్టు 17కి, అటుపైన తాజాగా ఆగస్టు 26కి పొడిగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వంద శాతం వాటాల విక్రయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లావాదేవీ సలహాదారుల నియామకం కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) జూలై 7న బిడ్లు (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది.