
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి సంబంధించి అంతర్జాతీయ నవకల్పనల (ఇన్నోవేషన్) సూచీలో భారత్ రెండు స్థానాలు ఎగబాకి 46వ ర్యాంకు దక్కించుకుంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ఈ సూచీని నిర్వహిస్తుంది.
గత కొన్నేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతోందని.. 2015లో 81వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 46వ స్థానానికి చేరిందని డబ్ల్యూఐపీవో ఒక ప్రకటనలో తెలిపింది. అపారమైన విజ్ఞాన సంపత్తి, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ, ప్రభుత్వ.. ప్రైవేట్ పరిశోధన సంస్థల కృషి ఇందుకు దోహదపడ్డాయని వివరించింది.
జాతీయ ఆవిష్కరణల వ్యవస్థను సుసంపన్నం చేయడంలో ఆటమిక్ ఎనర్జీ విభాగం, శాస్త్ర..సాంకేతిక విభాగం, బయోటెక్నాలజీ విభాగం, అంతరిక్ష విభాగం మొదలైన సైంటిఫిక్ డిపార్ట్మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని డబ్ల్యూఐపీవో పేర్కొంది.