భారత్‌కు 100 టన్నుల బంగారం | India moves 100 metric tonnes of gold from U.K. to domestic vaults | Sakshi
Sakshi News home page

భారత్‌కు 100 టన్నుల బంగారం

Jun 1 2024 6:04 AM | Updated on Jun 1 2024 10:51 AM

India moves 100 metric tonnes of gold from U.K. to domestic vaults

బ్రిటన్‌ నుంచి దేశీ ఖజానాకు తరలించిన ఆర్‌బీఐ 

1991 పసిడి తనఖా తర్వాత ఈ స్థాయిలో తరలింపు ఇదే ప్రథమం 

ముంబై: బ్రిటన్‌ వాల్టుల్లో భద్రపర్చిన 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ దేశీ ఖజానాకు తరలించింది. 1991లో భారత్‌ విదేశీ మారక సంక్షోభాన్ని అధిగమించేందుకు పసిడిని తాకట్టు పెట్టిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించడం ఇదే ప్రథమం అని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌ నుంచి బంగారం తరలింపు విషయంలో ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ, ఇతరత్రా ఏజెన్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అత్యంత విలువైన లావాదేవీ కావడంతో చాలా గోప్యత పాటించినట్లు వివరించాయి.

 రవాణా సౌలభ్యం తదితర అంశాలు పసిడి తరలింపునకు కారణమని పేర్కొన్నా యి. ప్రస్తుతం దేశీయంగా ముంబై, నాగ్‌పూర్‌లో పటిష్టమైన వాల్టుల్లో బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. తాజా పరిణామంతో దేశీయంగా భద్రపర్చిన మొ త్తం పసిడి పరిమాణం 408 టన్నులకు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం 2024 మార్చి ఆఖరు నాటికి భారత్‌ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో సుమారు 413.79 టన్నులు విదేశీ వాల్టుల్లో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గణనీయంగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో దాన్ని నిల్వ చేయడాన్ని తగ్గించుకోవాలని భారత్‌ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.   

తగ్గనున్న వ్యయాలు.. 
ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనడానికి దేశాలు కొన్న బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ మొదలైన వాటి వాల్ట్‌లలో సురక్షితంగా నిల్వ చేస్తుంటాయి. ఇందుకు కొంత చెల్లిస్తుంటాయి. తాజాగా బంగారాన్ని మన దేశానికి తరలించి, ఇక్కడే నిల్వ చేయ డం వల్ల విదేశీ కస్టోడియన్లకు చెల్లించాల్సిన స్టోరేజీ ఫీజుల భారాన్ని ఆర్‌బీఐ తగ్గించుకోగలుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement