![Lok Sabha passes Insolvency and Bankruptcy Code Bill - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2021/07/29/BANKRUPTCY.jpg.webp?itok=J-OPcivg)
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) దివాలా ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్ప్సీ కోడ్ (సవరణ) బిల్లు, 2021ను లోక్సభ ఎటువంటి చర్చా లేకుండా బుధవారం ఆమోదించింది. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. పెగాసస్పై సభ్యుల తీవ్ర ఆందోళనల నడుమ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ దివాలా చట్ట సవరణ బిల్లును సభ ఆమోదం నిమిత్తం ప్రవేశపెట్టారు. మహమ్మారి ప్రేరిత సవాళ్లను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఊరట కలిగిస్తూ, ఏప్రిల్ 4న తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రూ.కోటి లోపు రుణ వైఫల్యం జరిగిన ఎంఎస్ఎంఈ దివాలా పక్రియను తాజా బిల్లు సులభతరం చేస్తుంది. తమ రుణాలను పునర్ వ్యవస్థీకరించుకునేందుకు వీలు కల్పిస్తుంది.