Ambani advice: ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
Published
Sat, Apr 15 2023 8:30 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం గురించి పరిచయం అక్కర్లేదు. దేశంలోనే సంపన్న కుటుంబం కావడంతో ఆ కుటుంబం గురించిన ప్రతి విషయంపైనా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సతీమణి నీతా అంబానీ, కుమారులు, కుమార్తె, అల్లుడు ఇలా ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన అల్లుడు, కుమార్తె ఇషా అంబానీ భర్త అయిన ఆనంద్ పిరమల్కు ముఖేష్ అంబానీ ఇచ్చిన సలహా వెలుగులోకి వచ్చింది.
ఆనంద్ పిరమల్ భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అజయ్ పిరమల్ కుమారుడు. తన తండ్రి నిర్మించిన ఫార్మారంగ వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరి నందిని పిరమల్తో కలిసి నడుపుతున్నాడు. ప్రస్తుతం వారి కుటుంబ నికర ఆస్తి విలువ దాదాపు రూ.24 వేల కోట్లు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీకి అల్లుడు. ఇషా అంబానీని వివాహం చేసుకున్నాడు. అయితే ముఖేష్ అంబానీకి ఆనంద్ పిరమల్ ముందు నుంచే తెలుసు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సలహాలను ఆనంద్ తీసుకునేవాడు.
ఆనంద్ పిరమల్, ఇషా అంబానీల వివాహం 2018లో జరిగింది. వారికి కవలలు జన్మించారు. వారి పేర్లు కృష్ణ, ఆదియా. పెళ్లికి ముందే వీరి కుటుంబాలు ఒకరికొకరు తెలుసు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరియర్కు సంబంధించి ముఖేష్ అంబానీ తనకు ఏం సలహా ఇచ్చారో ఆనంద్ పిరమల్ బయటపెట్టాడు. క్రికెట్ను ముడిపెడుతూ అంబానీ ఇచ్చిన సలహా ఆసక్తికరంగా ఉంది.
తాను కన్సల్టింగ్ లేదా బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఆనంద్ ఒకసారి అంబానీకి చెప్పాడు. దానిపై అతని సలహా కోరాడు. దీనికి అంబానీ క్రికెట్ను ముడిపెడుతూ చక్కని సలహా ఇచ్చాడు. కన్సల్టెంట్గా ఉండటం అనేది క్రికెట్ చూడటం లేదా క్రికెట్ గురించి వ్యాఖ్యానించడం లాంటిదని, అదే పారిశ్రామికవేత్త కావడం అనేది క్రికెట్ ఆడటం లాంటిదని అంబానీ తనకు సలహా ఇచ్చారని పిరమల్ చెప్పారు. ఇది తనకు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పాల్సిందని, 25 ఏళ్ల వయసులో కాదని తాను అంబానీతో చమత్కరించిన్లు పేర్కొన్నారు.
ఎవరీ ఆనంద్ పిరమల్?
పిరమిల్ గ్రూప్ ఆర్థిక సేవలకు ఆనంద్ పిరమల్ నాయకత్వం వహిస్తున్నారు. అతని కంపెనీ గృహ రుణాలు, ఎస్ఎంఈ లోన్లు, నిర్మాణ ఫైనాన్స్ మొదలైనవాటిని అందిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ విభాగానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. పిరమల్ ఈ-స్వస్థ్య అనే ఆనంద్ స్థాపించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే ఈ కంపెనీలో దాదాపు 2300 మంది ఉద్యోగులు, 140 మంది వైద్యులు ఉన్నారు.
ఆనంద్ పిరమల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 100 ఏళ్ల ఇండియన్ మర్చంట్ ఛాంబర్స్ యువజన విభాగానికి ఆనంద్ అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు.