
జైప్రకాశ్ అసోసియేట్స్పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
జేపీ గ్రూప్లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment