
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్లో ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ 7 శాతం వాటాను విక్రయించనుంది. కంపెనీలో పబ్లిక్ వాటాను 25 శాతానికి పెంచే బాటలో స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనున్నట్లు పతంజలి ఫుడ్స్ పేర్కొంది. తద్వారా పతంజలి ఆయుర్వేద్ 2.53 కోట్ల షేర్లను( 7 శాతం వాటా) విక్రయించనున్నట్లు వెల్లడించింది.
ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(13న) ప్రారంభంకానున్న ఓఎఫ్ఎస్ శుక్రవారం(14న) రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. వాటా విక్రయం ద్వారా పతంజలి ఆయుర్వేద్ కనీసం రూ. 2,530 కోట్లు అందుకోనుంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్లో పబ్లిక్కు 19.18 శాతం వాటా ఉంది. కాగా.. డిమాండు ఆధారంగా పతంజలి ఆయుర్వేద్ అదనంగా 2 శాతం వాటా(72.4 లక్షల షేర్లు)ను విక్రయించనుంది. వెరసి 9 శాతం వరకూ వాటాను తగ్గించుకునే యోచనలో ఉంది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం లాభంతో రూ. 1,228 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment