
ఎంత పని జరిగింది, రిలయన్స్ జియోకు బిగ్ షాక్!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ రిలయన్స్ జియోకు జనవరిలో షాక్ తగిలింది. ఏకంగా 93.22 లక్షల మంది చందాదారులు దూరమయ్యారు. ఒక్క ఎయిర్టెల్ మాత్రమే నికరంగా 7.14 లక్షల మంది చందాదారులను సంపాదించింది. ఈ మేరకు జనవరి నెల గణాంకాలను ట్రాయ్ విడుదల చేసింది.
2021 డిసెంబర్ నాటికి 117.84 కోట్లుగా ఉన్న టెలికం సబ్స్క్రయిబర్ల సంఖ్య 2022 జనవరి చివరికి 116.94 కోట్లకు తగ్గింది. వైర్లెస్ చందాదారులు 0.81 శాతం తగ్గి 114.52 కోట్లుగా ఉన్నారు. వొడాఫోన్ ఐడియా 3.89 లక్షల మంది కస్టమర్లు చేజార్చుకోగా.. బీఎస్ఎన్ఎల్ సైతం 3.77 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.
వైర్లైన్ విభాగంలో రిలయన్స్ జియో 3.08 లక్షల మంది కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. మొత్తం మీద వైర్లైన్ కస్టమర్లు గత డిసెంబర్ నాటికి 2.37 కోట్లుగా ఉంటే, జనవరి చివరికి 2.41 కోట్లకు పెరిగారు.