అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం | SECI Bars Reliance Power For Three Years Check The Reason | Sakshi
Sakshi News home page

అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం

Nov 7 2024 2:50 PM | Updated on Nov 7 2024 3:10 PM

SECI Bars Reliance Power For Three Years Check The Reason

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనిల్ అంబానీకి మళ్ళీ గట్టి ఎదురుదెబ్బ తెగిలింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలపై మూడేళ్లపాటు టెండర్లలో బిడ్డింగ్ చేయకుండా 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (SECI) నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

SECI తన టెండర్ ప్రక్రియలో భాగంగా జూన్‌లో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్‌ బ్యాటరీ ఎనర్జీ వంటి వాటికి బిడ్‌లను ఆహ్వానించింది. ఆ సమయంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేయడం మాత్రమే కాకుండా.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ సమర్పించిన బిడ్‌ను రద్దు చేసి నిషేదించింది.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో SECI డిబార్‌మెంట్ ఒకటి. అంత కంటే ముందు ఆగస్టులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంబానీని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించి, రూ. 25 కోట్ల జరిమానా కూడా విధించింది. అక్టోబర్‏లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సెబీని పెనాల్టీ వసూలు చేయకుండా నిలిపివేసినప్పటికీ, సెక్యూరిటీల మార్కెట్ నుంచి డిబార్‌మెంట్ కొనసాగుతోంది.

రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ జారీ చేసిన సాధారణ ప్రయోజన రుణాలకు సంబంధించిన కేసులో కూడా సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ అంబానీ 2016లో పిపావావ్ షిప్‌యార్డ్‌ను కొనుగోలు చేయడంలో భారీగా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత దానిని రిలయన్స్ నావల్ & ఇంజినీరింగ్‌గా మార్చారు. ఇది కూడా ఊహించనిరీతిలో ముందుకు వెళ్లలేకపోయింది. చివరకు దానిని విక్రయించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement