
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయి. గత ఏడాది దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలతో పాటుగా, స్వదేశీ ఈవీ స్టార్టప్స్ కూడా అమ్మకాల్లో దుమ్మురేపాయి. గత ఏడాది భారత్లో ఏకంగా 1.43 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడైనాయి.
2021 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రభంజనం సృష్టించాయి. బుకింగ్స్లో ఓలా స్కూటర్లు దుమ్మురేపాయి. కాగా ఓలా ఇప్పటివరకు కేవలం 4000 స్కూటర్లను మాత్రమే డెలివరీ చేసినట్లు సమాచారం. వాటిలో కేవలం 300 వరకు మాత్రమే ఆయా రాష్ట్రాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ అయినట్లుగా తెలుస్తోంది. ఓలాతో మినహాయిస్తే గత ఏడాది భారత్లో అత్యధికంగా అమ్ముడైన వాహనాల లిస్ట్లో హోండా ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఏథర్ ఎనర్జీ, ఆంపియర్, ప్యూర్ ఈవీ బైక్స్ ఉన్నాయి.
హీరో ఎలక్ట్రిక్
హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ భారత్లో 30 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కల్గి ఉంది. భారత్లో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా హీరో ఎలక్ట్రిక్ కొనసాగుతోంది. 2021గాను హీరో ఎలక్ట్రిక్ 46,260 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఒక్క డిసెంబర్లోనే హీరో 6,058 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది.హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత్లో తొమ్మిది ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఫోటాన్ హెచ్ఎక్స్, ఆప్టిమా హెచ్ఎక్స్ (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా హెచ్ఎక్స్ (సింగిల్ బ్యాటరీ), ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ ( డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా ఎల్ఎక్స్ , ఆప్టిమా ఎల్ఎక్స్ , ఫ్లాష్ ఎల్ఎక్స్ , అట్రియా ఎల్ఎక్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 46,640 నుంచి రూ. 74,240 మధ్య ఉన్నాయి.
ఒకినావా ఆటోటెక్
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒకినావా 2021గాను ఈవీ సెగ్మెంట్లో రెండవ అతిపెద్ద తయారీదారుగా నిలిచింది. ఒకినావా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్పేస్లో 20 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఒకినావా గతేడాది 29,945 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం భారతీయ కస్టమర్ల కోసం ఆరు మోడళ్లను అందిస్తోంది ఒకినావా. వీటిలో i-Praise, Praise , Ridge Plus, R30 , Lite ,Dual వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ల ధరలు రూ. 59,000 నుంచి రూ. 1.09 లక్షల వరకు ఉన్నాయి.
ఏథర్ ఎనర్జీ
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఏథర్ ఎనర్జీ ఇప్పుడు భారత్లోని ప్రముఖ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన తయారీదారులలో ఒకటిగా ఎదిగింది. ఏథర్ గత సంవత్సరం 15,921 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. 11 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత్లో కేవలం రెండు మోడళ్లను మాత్రమే అందిస్తోంది. వీటిలో 450, 450X మోడల్స్ ఉన్నాయి. వీటి ధర రూ.1.40 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి.
ఆంపియర్ వాహనాలు
గ్రీవ్స్ కాటన్ కంపెనీలో భాగమైన ఆంపియర్ వెహికల్స్ భారత్లో నాల్గవ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా నిలుస్తోంది. 2021గాను కంపెనీ 12,470 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి,భారత్లో ఎనిమిది శాతానికి పైగా మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఆంపియర్ ప్రస్తుతం భారతీయ కస్టమర్ల కోసం ఐదు మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో Reo, Reo Elite , Magnus EX, Magnus Pro, Zeal ఉన్నాయి .
ప్యూర్ ఈవీ
ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ప్యూర్ ఎనర్జీ , తక్కువ వ్యవధిలో అమ్మకాల్లో దుమ్మురేపింది. 2021గాను 11,039 యూనిట్లను విక్రయించింది. ఏడు శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ ప్రస్తుతం భారత్లో EPluto 7G, Etrance Neo, Etrance , Etron Plus వంటి నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది.
చదవండి: గత ఏడాది భారత్కు గుడ్బై..! ఇప్పుడు మళ్లీ రిఎంట్రీ ఇవ్వనున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!
Comments
Please login to add a commentAdd a comment