రేప్‌ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! | The girls kidnapping case is taking twists and turns | Sakshi
Sakshi News home page

రేప్‌ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!

Published Sat, Jul 13 2024 5:01 AM | Last Updated on Sat, Jul 13 2024 9:41 AM

The girls kidnapping case is taking twists and turns

మలుపులు తిరుగుతున్న బాలిక కిడ్నాప్‌ వ్యవహారం   

ఆరు రోజులుగా నిద్రలేని ముచ్చుమర్రి గ్రామం 

ఈ దారుణానికి ఒడిగట్టింది తామేనన్న ముగ్గురు మైనర్‌లు

కాలువలో పడేశామని ఒక రోజు, పంప్‌హౌజ్‌లో అని మరో రోజు మాట మార్చిన వైనం 

నిందితుల్లో ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు 

ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన  

సాక్షి, నంద్యాల/పగిడ్యాల/నందికొట్కూరు : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియక పోవడం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత బాలురు చెబుతుండటంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. 

ఇదే సమయంలో పోలీసుల విచారణ నత్త నడకను తలపిస్తోంది. దీంతో తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండని బాలిక తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా  పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్‌ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. 

పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోమవారం రాత్రి పోలీసులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కొత్త ముచ్చుమర్రి పార్క్‌లో పనిచేసే సిబ్బందిని విచారించారు. ముగ్గురు మైనర్‌ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.    

అన్ని చోట్లా వెతికినా ఫలితం శూన్యం 
నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన సుమారు 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను కృష్ణా నది నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌజ్‌ వరకు ఉన్న లింక్‌ చానల్‌లో పడేశామని చెప్పడంతో పోలీసు సిబ్బంది కాలువను జల్లెడ పట్టారు. స్పీడ్‌ బోట్లతో కాలువ మొత్తం గాలించారు. గజ ఈత గాళ్ల సాయం తీసుకున్నారు. 

వలలు వేసి వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింక్‌ చానల్‌లో కాదు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లో పడేశామని చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. 

పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరూ నేరం తాను చేయలేదని వాడే చేశాడంటూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికను వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు.  

నీటి కుక్కలు తినేశాయా? 
చిన్నారిని ఆదివారం రాత్రే గొంతు నులిమి విద్యార్థులు హత్య చేసినట్లు  సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ లింక్‌ చానల్‌లో పడేసినట్లయితే మూడు రోజులకే మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న నీటి కుక్కలు శవాన్ని పీక్కుతినేశాయా అనే అనుమానం పోలీసులను వేధిస్తోంది. శుక్రవారం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ (బాలికను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు.. ఎక్కడ రేప్‌ చేశారు.. ఎలా గొంతు నులిమి చంపేశారు.. అన్న వివరాలను నిందితుల నుంచి స్పాట్‌కు తీసుకెళ్లి రాబట్టడం) చేసినట్లు తెలిసింది. 

అయినా  బాలిక ఆచూకీ తెలుసుకోలేక పోవడంతో  పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ విజయరావు ఘటనా స్థలికి ఇలా వచి్చ.. అలా వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  శుక్రవారం మైనర్‌ బాలిక ఫ్లెక్సీతో బంధువులంతా రోడ్డెక్కి ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అని నినదించారు. కొత్త ముచ్చుమర్రి నుంచి పాత ముచ్చుమర్రి క్రాస్‌ రోడ్డుకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. 

ఆరు రోజులైనా తమ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఐజీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్‌ఐ జయశేఖర్‌ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రుకీయా బేగం పరామర్శించారు.  

బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
బాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు బ్రాహ్మణకొట్కూరు వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎట్టకేలకు బాధిత చిన్నారి తండ్రినే అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీహార్, మణిపూర్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష పార్టీల నాయకులను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపిస్తున్నారన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారని ప్రశి్నంచారు. 

తన సొంత గ్రామంలో బాలిక హత్య జరిగితే, ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. ముచ్చుమర్రికి తాను వెళితే నిజాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారా అని నిలదీశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులు కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, చంద్రమౌళి, రవియాదవ్, తులసిరెడ్డి, రమే‹Ùనాయుడు, ఉపేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, శ్రీకాంత్, నాగభూషణంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement