
విజయవాడ లీగల్: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితకాల జైలుశిక్షతో పాటు రు.10 వేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమారులు. ఇదేప్రాంతంలో అమరావతి తిరుపతిరావు (32) నివశిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 22న రాఖీ పండుగ రోజు తన ఇద్దరు కుమారులతో కలసి తల్లి తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఐదేళ్ల రెండోకుమారుడు ఆరుబ యట ఆడుకుంటుండగా తిరుపతిరావు ఆ బాలుడికి మాయమాటలుచెప్పి ఎదురుగా నిర్మిస్తున్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలుడి శరీరభాగాల్లో రాళ్లను జొప్పించాడు. కొద్దిసేపటి తర్వాత నోటి నుంచి రక్తం కారుతూ నడవలేని స్థితిలో చేతులతో పాకుతూ వస్తున్న కుమారుడిని చూసిన తల్లి పడిపోయాడని భావించింది. స్నానం చేయించేందుకు దుస్తులు విప్పగా రక్తం కారుతుండటం గమనించి.. ఏం జరిగిందని ఆరా తీసింది. బాలుడు జరిగింది చెప్పడంతో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 29న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో అమరావతి తిరుపతిరావుకు న్యాయమూర్తి పైన పేర్కొన్న శిక్షను విధిస్తూ.. బాలుడికి రూ.5 లక్షలు వచ్చేటట్లు చూడాలని మండల న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment