![Notorious Criminal Mantri Shankar Arrested By Taskforce Police In Hyderabad - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2020/12/25/nara.jpg.webp?itok=z9aGNcp-)
సాక్షి, హైదరాబాద్ : కరుడుగట్టిన నేరస్థుడిగా ముద్రపడిన మంత్రి శంకర్ను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. శంకర్తో పాటు అతని ముగ్గురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 12 లక్షల నగదు, సిల్వర్ ఆభరణాలు,రెండు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి నేరాలకు పాల్పడడంలో శంకర్ దిట్ట. ఇప్పటివరకు సుమారు 300 దొంగతనాలకు పాల్పడ్డ శంకర్ 30 సార్లు అరెస్ట్ అయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్కు అతని స్వగ్రామంలో మంచి దానఖర్ముడని పేరు ఉండడం విశేషం. కాగా హైదరాబాద్లో సెటిల్ అయిన మంత్రి శంకర్కు ముగ్గురు భార్యలు.. ఆరుగురు సంతానం ఉన్నారు. (చదవండి : గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు)
హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. 'ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ముద్రపడిన మంత్రి శంకర్ను పట్టుకున్నాం. అతనితో పాటు అనుచరులు అబ్దుల్ లతీఫ్ ఖాన్, మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుల నుంచి 12 లక్షల 9వేల నగదు, 100 గ్రాముల అర్నమెంట్ బంగారం,రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం. మంత్రి శంకర్ 1979 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. అతనిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 250 కేసులు ఉన్నాయి.ఈ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి 1 నుంచి 4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంది. ఈ నెల 4న జైలు నుంచి విడుదలైన శంకర్ బయటకు వచ్చి 20 రోజుల్లోనే 6 దొంగతనాలకు పాల్పడ్డాడు. కుషాయిగూడ,వనస్థలిపురం,బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారన్నారు. (చదవండి : ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం)