Published
Mon, Jul 22 2024 2:25 AM
| Last Updated on Mon, Jul 22 2024 2:25 AM
మరో 8 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ప్రమాదం
మార్కాపురం: రహదారిపై గేదెలు అడ్డురావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల, తిప్పాయపాలెం గ్రామాల మధ్య అమరావతి–అనంతపురం హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సు చింతగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్యకు రాగానే ఆకస్మికంగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్య(45)కు తీవ్ర గాయాలుకావడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కె.విజయలక్ష్మీబాయి(40)కి తీవ్రగాయాలయ్యాయి.
ఆమెకు మార్కాపురం జీజీహెచ్లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నరసరావుపేట వద్ద మృతిచెందారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో హరినాథ్, రాజీబీ, నాగమయ్య నాయక్, ఢమరుకానందరెడ్డి, మునీందర్రెడ్డి, అప్సన్, మోహిత్, దస్తగిరి అనే ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి మార్కాపురం జీజీహెచ్లో చికిత్స అందించారు. గజ్జల శివయ్యకు భార్య సువర్ణ, ఒక కుమారుడు, కుమార్తె, విజయలక్ష్మీబాయికి భర్త కాశీనాయక్, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment