
సాక్షి,విజయనగరం: పశు పోషణే వారి జీవనాధారం. రోజూ వలే శనివారం ఉదయం గేదెలను మేత కు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో ఇద్దరు గిరిజన యువతులను కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పాచిపెంట ఎస్ఐ ఎం.వెంకటరమణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాడవలసకు చెందిన ఇద్దరు గిరిజన యువతులు తోరిక గాయత్రి(17), సంగిరెడ్డి నాగమణి (25) తోటి కాపరులతో కలిసి (ఆరుగురు కాపరులు) గేదెలను కర్రివలస పంచాయతీ అమ్మవలస గ్రామ పొలాల వైపు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి గేదెలను ఇంటికి తోలుకువస్తుండగా మార్గం మధ్యలోని అమ్మవలస సమీపంలో కర్రివలస వేగావతి ఆయకట్టు ఎడమకాలువలో దిగాయి. ఇటీవల కురిసిన వర్షా లకు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇసుక తవ్వకాలు, పూడికల తొలగింపుతో కాలువ లోతు ఎక్కువ గా ఉంది. గేదెలను ఒడ్డుకు చేర్చే ఆత్రుతలో కాలువ లోతును గుర్తించకుండా ఇద్దరూ నీటిలో దిగారు. అంతే.. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. కళ్లముందరే మునిగిపోతున్న యువతులను కాపాడేందుకు తోటి కాపరుల ప్రయత్నం ఫలించలేదు. వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అప్పటివర కు తమతో సరదాగా గడిపిన యువతుల మృతితో బోరున విలపించారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో మృతదేహాల ను పంచనామా నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించారు. వీరి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment