
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
మండ్య/కర్ణాటక: కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లల సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని నాగమంగళ తాలూకా హుళ్లెనహళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని కెరెగోడు సమీపంలో ఉన్న గౌడగెరె గ్రామానికి చెందిన గిరీశ్ భార్య సించన (32), పిల్లలు డింపన (4), మహేంద్ర (6) ఉన్నారు. కుటుంబంలో వచ్చిన గొడవలతో సించన పుట్టినిల్లు హుళ్లెణహళ్లి గ్రామానికి వచ్చింది. గురువారం ఉదయం తన పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ముద్దొచ్చే చిన్నారులను చూసైనా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది.
వివాహిత దారుణహత్య
తుమకూరు: గొర్రెలను మేత కోసం తీసుకెళ్తున్న మహిళపై దుండగులు వేటకొడవలితో నరికి హత్య చేశారు.ఈ ఘటన తుమకూరు తాలూకా కోడి తిమ్మనహళ్లిలో గురువారం చోటు చేసుకుంది. కోరా పోలీసుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాగరాజు భార్య సిద్దగంగమ్మ(40) రోజులాగే గురువారం ఉదయం గొర్రెలను మేత కోసం పొలానికి తీసుకెళ్తుండగా గ్రామ సమీపంలో కాపుగాసిన దుండగులు ఆమెపై దాడి చేశారు.
వేడకొడవలితో మెడపై, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తనకు, అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో గొడవలు ఉన్నాయని, తన భార్యను వారే హత్య చేసి ఉంటారని హతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment