అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు పాల్గొన్నాయి. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 62 మంది, శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 25 జంటలు, స్వామివారి గరిక పూజలో ఒక జంట పాల్గొన్నారు. ముగ్గురు భక్తులు స్వామికి ఉండ్రాళ్ల పూజలు జరిపారు. స్వామి వారి సన్నిధిలో 77 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, 15 మంది చిన్నారులకు అన్న ప్రాశనలు, 14 మందికి తులాభారం, ఒకరికి నామకరణ చేశారు. స్వామికి 12 మంది తలనీలాలు సమర్పించారు. 48 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 4,100 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.5,72,525 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment