భార్యను కత్తితో నరికిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను కత్తితో నరికిన భర్త

Published Fri, Feb 21 2025 12:22 AM | Last Updated on Fri, Feb 21 2025 12:20 AM

భార్యను కత్తితో నరికిన భర్త

భార్యను కత్తితో నరికిన భర్త

ఆమె అక్కడికక్కడే మృతి

అడ్డు వచ్చిన మామ పైనా దాడి

తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు

కొవ్వూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో నరికిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, మామ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొవ్వూరు ఎస్సై కె.జగన్‌మోహన్‌ కథనం ప్రకారం.. కొవ్వూరు మండలం వాడపల్లి బంగారుపేటకు చెందిన అడ్డాల నాగయ్య రెండో కుమార్తె కృష్ణతులసి(33)కి, కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడేనికి చెందిన మురళీకృష్ణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య మనస్పర్థలు రావటంతో కృష్ణతులసి కుమారుడు రాముతో కలసి ఆరు నెలల క్రితం బంగారుపేటలోని తండ్రి నాగయ్య వద్దకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ కూడా బంగారుపేటకు వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. నాగయ్యకు అల్లుడు మురళీకృష్ణ కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు అడిగేందుకు కృష్ణతులసి గురువారం సాయంత్రం భర్త మురళీకృష్ణ వద్దకు వెళ్లింది. తనను డబ్బులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మురళీకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమైపె దాడి చేశాడు. అది గమనించిన నాగయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా మురళీకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కృష్ణతులసి అక్కడికక్కడే మృతి చెందగా, నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మురళీకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కృష్ణతులసి కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.జగన్‌మోహన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement