కనులపండువగా అమ్మవారి ఒడిబియ్యం మహోత్సవాలు | grand celebration of Ammavari Odibiyam Mahotsavam At maharashtra | Sakshi
Sakshi News home page

కనులపండువగా అమ్మవారి ఒడిబియ్యం మహోత్సవాలు

Nov 4 2024 10:53 AM | Updated on Nov 4 2024 10:53 AM

grand celebration of Ammavari Odibiyam Mahotsavam At maharashtra

శేషవాహనంపై అమ్మవారి ఊరేగింపు 

భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు  

భివండీ: భివండీ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ పురస్కరించుకొని శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి అమ్మవారికి ఒడి బియ్యం మహోత్సవ కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్‌ దీపాలతో పాటు వివిధ రంగుల పూలతో వైభంగా ముస్తాబు చేశారు. పద్మశాలీయుల ఆడపడుచైన అమ్మవారికి  ఒడి బియ్యం కార్యక్రమాలలో పద్మశాలీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకుడు ప్రసాద్‌ స్వామి నేతృత్వంలో జరిగాయి. 

శనివారం ఉదయం స్వామి వారికి నిత్య పూజలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఒడి బియ్యం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వేంకటేశ్వర స్వామి అమ్మవారిని శేషవాహనంపై మందిరం నుంచి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు పద్మనగర్‌ పురఃవీధులు మహాముని చౌక్, దత్తమందిర్, రామ్‌ మందిర్, గీతా మందిర్, బాజీ మార్కెట్, వరాలదేవి రోడ్‌ నుంచి తిరిగి రాత్రి 10 గంటల వరకు మందిరాన్ని చేరుకుంది. 

ఊరేగింపులో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీధివీధిన స్వామి వారికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. దర్శనం నిమిత్తం బారులు తీరి హారతులు, కానుకలు సమరి్పంచుకున్నారు. సిద్ధివినాయక్‌ భజన మండలి, గీతా భజన మండలి వారు ఆలకించిన అన్నమయ్య కీర్తనలతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. రాత్రి నిర్వహించిన అన్నదానంలో సుమారు ఐదు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారని దేవస్థాన కమిటీ సభ్యుడు దావత్‌ కైలాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గౌడ లింగం, బైరి జనార్దన్, డాక్టర్‌ పాము మనోహర్, వడిగొప్పుల శంకర్‌ పంతులు, బాలె శ్రీనివాస్, అవధూత బలరామ్, భీమనాథిని శివప్రసాద్, బూర్ల మనోజ్‌తో పాటు వందల సంఖ్యలో పద్మశాలీ కులబాంధవులు భక్తులు పాల్గొని సేవలందించారు. 

ఇదీ చదవండి : వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement