Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త! | Karnataka Government's Latest Decision Regarding Gender Determination | Sakshi
Sakshi News home page

కడుపులో బిడ్డను.. లింగ నిర్ధారణ చేయకుండా కనాల్సిందే!

May 30 2024 8:43 AM | Updated on May 30 2024 9:46 AM

Karnataka Government's Latest Decision Regarding Gender Determination

కర్నాటక ప్రభుత్వం అల్ట్రాస్కానింగ్‌ గదిలోకి గర్భిణులతోపాటు వచ్చే అటెండర్స్‌ను నిషేధిస్తూ సర్క్యులర్‌ తెచ్చింది. ప్రతి తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లైనా మగపిల్లాడైనా కనడానికి సిద్ధంగా ఉంటుంది. కాని అటెండర్స్‌ రూపంలో వచ్చే అయినవాళ్లు అల్ట్రాస్కానింగ్‌ని వీడియో తీసి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. తర్వాత అబార్షన్‌ చేయిస్తున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదో. కర్నాటక మేలుకొంది. ఆ రాష్ట్రం తీసుకున్న మరిన్ని జాగ్రత్తలు..

హర్యాణలోని జాట్‌ కుటుంబంలో యోగ్యుడైన వరునికి తగిన వధువు కోసం 3000 కిలోమీటర్ల దూరంలో కూడా వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నా కానీ ఆడశిశువుల భ్రూణ హత్యల విషయంలో మనలో మార్పు రావడం లేదు. 2000 సంవత్సరం నుంచి 2019లోపు మన దేశంలో 90 లక్షల మంది ఆడపిల్లలు భ్రూణ హత్యల ద్వారా పుట్టకుండానే మరణించారని ఒక అధ్యయనం చెబుతోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్, హర్యాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో 120 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలే ఉన్నారు. లెక్కలు ఇంత భయపెడుతున్నా నేటికీ ఒడిశా, కర్నాటక రాష్ట్రాలలో లింగ నిర్థారణ జరిపించి మరీ ఆడపిల్లలను ఛిద్రం చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఈ రాకెట్‌ ఒకటి బట్టబయలు కావడంతో ప్రభుత్వం మేల్కొని కొత్త నియమ నిబంధనలు తెచ్చింది.

చట్టం ఉన్నా...
ప్రీ కన్సెప్షన్‌ అండ్‌ ప్రీ నాటల్‌ డయగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ (పిసిపిఎన్‌డిటి) యాక్ట్‌ 1994 (లింగ నిర్థారణ నిషేధ చట్టం) కింద లింగ నిర్థారణ చేయించేవారికి గరిష్టంగా 5 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉన్నా కొందరు ఎప్పటికప్పుడు దొంగదారులు కనిపెడుతూనే ఉన్నారు. ఇటీవల కర్నాటకలో లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలులో భాగంగా రేడియాలిజిస్ట్‌లు, గైనకాలజిస్ట్‌లతో ఒక వర్క్‌షాప్‌ జరిగినప్పుడు వారు కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

– పేషెంట్లతోపాటు అటెండర్ల పేరుతో బంధువులు లోపలికి వస్తున్నారు.
– అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ను తమ మొబైల్‌ కెమెరాలలో బంధిస్తున్నారు.
– సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్‌ దేశాలలో లింగ నిర్థారణ నేరం కాదు.
– కొందరు ఒక రాకెట్‌లాగా ఏర్పడి ఆ వీడియోలను ఈ దేశాలలోని వైద్యులకు పంపి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. ఆ తర్వాత అబార్షన్లు చేయిస్తున్నారు.

తాజాగా మాండ్యాలో ఇలాంటి రాకెట్‌ను పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం వెంటనే కొత్త సర్క్యులర్‌ జారీ చేసింది.

ఇతరులు రాకూడదు..
– అల్ట్రాసౌండ్‌ గదిలోకి గర్భిణితోపాటు ఇకపై అటెండర్లు రాకూడదు. వారికి ప్రవేశం లేదు.
– గర్భిణి తన ఆల్ట్రాసౌండ్‌ పరీక్షను గమనించేలాగా గతంలో అడిషనల్‌ స్క్రీన్‌ గదిలో ఉంచేవారు. ఇకపై ఆ స్క్రీన్‌ ఉండదు. అంటే గర్భిణి తన అల్ట్రాసౌండ్‌ పరీక్షను చూడటానికి అనుమతి లేదు. ఎందుకంటే కొందరు రేడియాలజిస్ట్‌లు డబ్బుకు కక్కుర్తి పడి ఒక మాట గాని, చర్యగాని లేకుండా గర్భిణులకు అర్థమయ్యేలా పాయింటర్‌తో చూపుతున్నారు.

ఆడపిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తున్నా, ఉపాధి అవకాశాలు పొందుతున్నా, క్రీడల్లో పతకాలతో మెరుస్తున్నా, రాజకీయ పదవులు పొందుతున్నా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా ఇంకా ‘కొడుకు’ కావాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులను పీడిస్తోంది. ఆ భావజాలం నుంచి కొద్దిగా బయటడినా చాలామంది ఆడపిల్లలు బతికి΄ోతారు. బంగారు దేశాన్ని నిర్మిస్తారు.

ఇవి చదవండి: Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్‌ వరకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement