గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’! | Sakshi
Sakshi News home page

గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!

Published Wed, Feb 28 2024 4:12 PM

Vidya Balan Keeps Calm Fan urges for Selfies At Pankaj UdhasLast Rites - Sakshi

పంకజ్‌ ఉధాస్‌ అంత్యక్రియల్లో ఫ్యాన్‌  సెల్ఫీ పిచ్చి

మౌనంగా నిష్క్రమించిన  విద్యాబాలన్‌ 

నెటిజనుల ఆగ్రహం

స్మార్ట్‌ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్‌అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత   ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ.  

అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్‌కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని  దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు.  ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్‌ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. 

విద్య ఫ్యాన్‌ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్‌. కొంతమంది విద్యా బాలన్‌ ప్రవర్తనను కొనియాడగా,  మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా  సిగ్గుండాలి’’ అంటూ  ఫ్యాన్‌పై మండిపడ్డారు. 

కాగా గజల్‌ మేస్ట్రో అస్తమయంపై యావత్‌ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు.   సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్  కూడా  పంకజ్‌ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం  ఆయనకు అంతిమ నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement