
పులిసిన రాజకీయం
ఫ్లెక్సీల వివాదంతో ముదిరిన విభేదాలు
తాను చెప్పిన పనులు చేయనందుకే..
తూర్పు ఎమ్మెల్యే అనుచరులు కొందరు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ పనులు చేపట్టారు. ఆ బిల్లులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాస్ చేయలేదు. దీంతో ఎమ్మెల్యే నసీర్ కమిషనర్కు ఫోన్ చేసి బిల్లులను పాస్ చేయాలని కోరినట్లు సమాచారం. అయినా కమిషనర్ బిల్లులను పాస్ చేయలేదు. దీనికితోడు కొల్లి శారదా మార్కెట్లో ఆశీలు వసూలు విషయంలోనూ నసీర్ మాట కమిషనర్ వినలేదు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కమిషనర్ తన మాట వినడం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి స్పందించిన కేంద్రమంత్రి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు వర్సెస్ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్గా మారిపోయింది గుంటూరు రాజకీయం.. కొద్దికాలంగా మున్సిపల్ కమిషనర్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అండదండలతో ఎమ్మెల్యేలను లెక్కచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పిన పనులేవీ చేయకపోవడంతో ఇద్దరి మధ్య కోల్డ్వార్ మొదలైంది. నాలుగు నెలలుగా ఇద్దరూ ఎడముఖంపెడముఖంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో తాము చెప్పిన పనులేవీ మున్సిపల్ అధికారులు చేయడం లేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు.
పారిశుద్ధ్యంపై ప్రజల నిలదీత.. ఎమ్మెల్యే సీరియస్
తాజాగా బుధవారం తన నియోజకవర్గం రాజీవ్గాంధీనగర్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్ధ్యం అధ్వానంగా ఉందంటూ ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఎక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్, రోడ్లు ఉడ్చుకుంటే సరిపోతుందా? పారిశుద్ధ్యాన్ని పట్టించుకోరా? ఒక ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినా మున్సిపల్ అధికారులు రారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడీఎఫ్ టీం వస్తే అధికారులు వెళ్లారంటూ స్థానిక మున్సిపల్ సిబ్బంది బదులిచ్చారు.
సాయంత్రం సమావేశమై మరీ క్లాస్
దీంతో ఎమ్మెల్యే నసీర్ సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో సమావేశమయ్యారు. అధికారుల తీరుపై చిర్రుబుర్రులాడారు. తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల నుంచి రూ.లక్షల ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ పారిశుద్ధ్య పనులూ చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి పారిశుద్ధ్య పనులను రోజూ పరిశీలించి ఒక్కొక్కరి వ్యవహారం తేలుస్తానని చెప్పారు. దీంతో కమిషనర్, ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలాఉంటే వారి మధ్య విభేదాలుంటే వాళ్లూవాళ్లూ చూసుకోవాలిగానీ తమను బలి చేస్తే ఎలాగంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
చెప్పిన వారికి బిల్లులు చెల్లించలేదని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అలక రంజాన్ ముందు రోజు ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగింపు అర్ధరాత్రి కమిషనర్కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే వర్గీయులు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికుల ఫిర్యాదులు స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పట్టించుకోరా అంటూ నసీర్ ఆగ్రహం అధికారులతో సమావేశమై మండిపాటు టీడీపీ అధిష్టానానికి కమిషనర్పై ఫిర్యాదుకు సిద్ధం
కమిషనర్ వర్సెస్ ఎమ్మెల్యే
రంజాన్ ముందురోజున నగరమంతా ఉన్న ఫ్లెక్సీలను పట్టించుకోని మున్సిపల్ అధికారులు పాతబస్తీలోని ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం వివాదానికి దారితీసింది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించి కమిషనర్కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. అధికార పార్టీ వారే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడానికి మున్సిపల్ కమిషనరే కారణమనే భావనలో ఉన్న నసీర్ కమిషనర్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

పులిసిన రాజకీయం