అమరావతి: మండలంలోని పలు గ్రామాలలో గురువారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) ప్రతినిధుల బృందం రైతులతో వ్యవసాయ క్షేత్ర సందర్శన, గ్రామసభలు నిర్వహించారు. తొలుత ఈ బృందం దిడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి మిర్చి రైతులను మిర్చి ఉత్పత్తి, మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు అత్తలూరులో నిర్వహించిన వ్యవసాయక్షేత్ర సందర్శనలో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. అనంతరం స్వయం సహాయక మహిళాసంఘాల సభ్యులు, రైతులతో ఆర్థిక అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్సీ బృంద సభ్యులు కె. విజయశేఖర్, హేమేంద్ర మెహర్, యువరాజ్ అహూజా, నవనీత్రాయ్, షెనాయ్ మ్యాధ్యు, ఇషాసర్, సీతల్ సోమనిలతో పాటు ఉద్యానవన శాఖ డీపీఎం అమలకుమారి, మండల, వ్యవసాయశాఖాధికారి అహ్మద్, ఉద్యాన అధికారి శ్రీనిత్య, అశోక్రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన నగర కమిషనర్
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న బి.సాయి కళ్యాణ్ చక్రవర్తిని గురువారం జిల్లా కోర్ట్లోని ఆయన కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కొండపాటూరు పోలేరమ్మకు రూ. 22.46 లక్షల ఆదాయం
ప్రత్తిపాడు: కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మకు తిరునాళ్ల సందర్భంగా రూ. 22.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బత్తుల సురేష్బాబు తెలిపారు. భక్తులు పోలేరమ్మ తల్లికి సమర్పించిన కానుకలు, హుండీలను తెరిచి ఆలయంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పాటల ద్వారా రూ. 3.90 లక్షలు, హుండీల ద్వారా 12.76 లక్షలు, టిక్కెట్ల ద్వారా 2.40 లక్షలు, చందాల రూపంలో రూ. 39 వేలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం 22,46,256 రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయశాఖ బాపట్ల ఇన్స్పెక్టర్ ఎం.గోపి, ఈవో బి. సురేష్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి మువ్వా రామచంద్రావు, గ్రామపెద్దలు యర్రాకుల దానయ్య, పి. శ్రీనివాసరావు, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేటి కౌన్సిల్ సమావేశం వాయిదా
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): ఈ నెల 25వ తేదీన జరగాల్సిన నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 28న మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది.
యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
తెనాలిరూరల్: యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు గుడివాడ గ్రామానికి చెందిన వివాహిత కామంచి ఆమని(34)ని అదే గ్రామానికి చెందిన పాలపర్తి మహేష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడే వాడు. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 4వ తేదీన పోలీసులను ఆశ్రయించగా 22వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 23వ తేదీన బెయిలు రావడంతో గ్రామానికి వెళ్లిన మహేష్ తనను పోలీసులు ఏం చేయలేక పోయారని, ఆమె అంతు తేలుస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలిని కుటుంబ సభ్యులు పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు.

ఐఎఫ్సీ బృందం క్షేత్ర సందర్శన