గిరిజనుల సంక్షేమం పట్టని కేంద్రం | - | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 27 2023 8:14 AM | Last Updated on Mon, Feb 27 2023 10:11 AM

మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు - Sakshi

మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు

పాలకుర్తి టౌన్‌/పాలకుర్తి: బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోఢ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం గిరిజ నుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాల్లో, రూ.2 కోట్లతో నిర్మిస్తున్న సేవాలాల్‌, మేరమయాడి ఆలయాల నిర్మాణ భూమిపూజలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించని బహిరంగ సభలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తికి, గిరిజనులకు ఎంతో చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్‌ చొరవతో ఈ ప్రాంతాన్ని అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూ.100 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గిరిజనులు మా ట్లాడే భాషకు లిపి లేదని, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంట్‌లో బిల్లు పెట్టి గిరిజన భాషకు లిపి కల్పించడంతోపాటు గిరిజన భాషకు జాతీయ భాషగా గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో సేవాలాల్‌ మహరాజ్‌, కొమరం భీమ్‌ భవనాలు నిర్మించాలన్నారు. గిరిజన రిజర్వేషన్ల విషయంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, గత పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజనుల సంక్షేమానికి సేవాలాల్‌ తరహాలో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ గిరిజనుల పాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో రూ.600 కోట్లతో 3,146 గిరిజన జీపీలకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తండాల్లో రోడ్లు మౌలిక వసతుల కల్పనకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తిలో రూ.1.50 కోట్లతో బంజారా భవన్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించే పోతన, సరస్వతీ దేవి నమూనా విగ్రహలను క్యాంపు కార్యాలయంలో మంత్రులు పరిశీలించారు. తర్వాత మంత్రి దయాక్‌రావు జనగామ కలెక్టర్‌ శివలింగయ్యతో కలిసి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సేవాలాల్‌ మహరాజ్‌ పీఠాధిపతి బాపూ సింగ్‌ మహరాజ్‌, మహబూబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, అడిషన్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, సేవాలాల్‌ మందిర నిర్మాణ కమిటీ బాధ్యులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు పాలకుర్తి చౌరస్తా నుంచి గుడి నిర్మించే స్థలం వరకు లంబాడా సంప్రదాయ నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

రాయపర్తిలో క్షుద్రపూజల కలకలం

రాయపర్తి: వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని బతుకమ్మ కుంట ప్రాంతంలో బాలుడిని ఖననం చేసిన గోతిపైన ఆదివారం క్షుద్రపూజలు చేసిన ఘటన వెలుగుచూసింది. స్థా నికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు రెండు నెలల క్రితం మృతిచెందగా బతుకమ్మకుంట ప్రాంతంలో ఖననం చేశారు. ఈ క్రమంలో మూడు రోజులక్రితం గుర్తుతెలియని వ్యక్తులు మనిషి రూపంలో ఉన్న బొమ్మతోపాటు, పసుపు, కుంకుమను చల్లి పలు రకాల వస్తువులను సమాధిపై పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement