
ఢాకా: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లో తాజాగా ఆమెపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొటోంది.
రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో చెలరెగిన అల్లర్లలో ఓ కిరాణా షాప్ యజమాని హత్య చేయబడ్డారు. ఈ హత్య కేసులో షేక్ హసీనాతో సహా ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసును.. అల్లర్లలో హత్య చేయబడ్డ కిరాణా ఓనర్ అబూ సయ్యద్ సన్నిహితుడు నమోదు చేశారు.
జూలై 19న మొహమ్మద్పూర్లో విద్యార్థుల నిరసనలో పోలీసు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లోనే అబూ సయ్యద్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్పై నిందితులుగా చేర్చారు. బంగ్లాలో చోటుచేసుకున్న నిరసనకారులు అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 560 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment