డ్రోన్‌ వార్‌ఫేర్‌! | Drone Warfare: big warning to India | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ వార్‌ఫేర్‌!

Jun 4 2025 5:01 AM | Updated on Jun 4 2025 5:01 AM

Drone Warfare: big warning to India

కొత్త రకం యుద్ధం 

భారత్‌కు పెను హెచ్చరిక

డ్రోన్ల రంగప్రవేశంతో యుద్ధాల తీరుతెన్నులే సమూలంగా మారిపోతున్నాయి. యుద్ధ విమానాలు మొదలుకుని చిన్నపాటి ఆయుధాల దాకా అన్నింటికీ డ్రోన్లు అతి సమర్థమైన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. ఈ కొత్త తరం డ్రోన్‌ వార్‌ఫేర్‌కు ఉక్రెయిన్‌ చేపట్టిన ఆపరేషన్‌ స్పైడర్స్‌ వెబ్‌ పరాకాష్టగా నిలిచింది. ఇది ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పక్కలో పాక్‌ వంటి దాయాది ఉన్న భారత్‌కు పెను హెచ్చరిక సంకేతమే. నిఘా నేత్రాలకు చిక్కకుండా డ్రోన్లను కీలక సైనిక స్థావరాల, పౌర వ్యవస్థల సమీపానికి చేర్చగలిగితే చాలు, వాటిపై పెను దాడులకు పాల్పడవచ్చు.

ఊహించలేనంత నష్టం కలగజేయవచ్చు. పాక్‌ ప్రేరేపిత ఉగ్ర ముఠాల స్లీపర్‌ సెల్స్‌ దేశమంతటా చొచ్చుకుపోయి మాటేసి ఉన్నాయన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో మనకిది ఆందోళనకర పరిస్థితేనని రక్షణ నిపుణులు అంటున్నారు. అలాంటి దాడులను కాచుకోవడం నిజంగా కత్తిమీద సామేనని అభిప్రాయపడుతున్నారు.
నాలుగేళ్ల క్రితమే: మన సైనిక దళాలను లక్ష్యం చేసుకుని నాలుగేళ్ల క్రితమే డ్రోన్‌ దాడులకు తెగబడ్డారు. 2021లో జమ్మూలోని వైమానిక స్థావరంపై రెండు డ్రోన్లతో దాడులు చేశారు.

వాటి ద్వారా అత్యాధునిక పేలుడు పదార్థాలను (ఐఈడీ) ఎయిర్‌బేస్‌పైకి జారవిడిచారు. అవి అదృష్టవశాత్తూ బహిరంగంగా నిలిపి ఉంచిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లకు, సిబ్బందికి దూరంగా పడి పేలడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ ఐఈడీలు పాక్‌ సైన్యం అందజేసినవేనని దర్యాప్తులో తేలింది. వాటి తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలన్నీ మిలిటరీ గ్రేడ్‌కు చెందినవని నిర్ధారణ అయింది. పాక్‌ నుంచి మనకు ఎన్నిరకాలుగా పెను ముప్పు పొంచి ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ మాత్రమే.

అదే పాక్‌ యుద్ధ తంత్రం!: ప్రత్యక్ష పోరులో పాక్‌ కనీసం కొద్ది రోజుల పాటు కూడా భారత్‌ ముందు నిలవలేదని ఆపరేషన్‌ సిందూర్, అనంతర ఘర్షణలు మరోసారి నిరూపించాయి. కనుక పాక్‌ తనకు బాగా అలవాటైన సూడో యుద్ధ నీతినే నమ్ముకుంటుందనడంలో సందేహం లేదు. ఉగ్ర ముఠాలకు మనపై దాడులకు ప్రేరేపించి, అందుకు కావాల్సిన సరంజామా అంతా అందించి సాయపడుతుంది. ఈ ముప్పుకు డ్రోన్ల రూపంలో ఇప్పుడు కొత్త కోరలు మొలిచినట్టే. కనుక భారత్‌ అత్యంత అప్రమత్తతతో మెలగక తప్పదు. అందుకే భారత్‌ డ్రోన్‌ దాడులను సమర్థంగా కాచుకుని, పూర్తి స్థాయిలో తిప్పికొట్టే వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. భారత్‌ తన కీలక సైనిక స్థావరాలు, మౌలిక వ్యవస్థల రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

’సిందూర్‌’లో డ్రోన్ల హవా
ఆపరేషన్‌ సిందూర్, తదనంతర ఘర్షణల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్‌ తొలి రోజు మే ఏడో తేదీన పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలు, స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడం తెలిసిందే.

 అందుకు ప్రతి చర్యగా పాక్‌ ప్రధానంగా నమ్ముకున్నది డ్రోన్‌ దాడులనే. మన సరిహద్దుల పైకి వందలాది డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో చాలావరకు మన భూభాగంలోకి ప్రవేశించాయి.

ఫలితంగా పాక్‌తో జరిగిన నాలుగు రోజుల ఘర్షణల్లో భారత్‌ కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించింది.

పాక్‌ వైమానిక స్థావరాలపై దాడులకు ముందు యుద్ధ విమానాల ముసుగులో డ్రోన్లను పంపి దాయాది కీలక రాడార్‌ వ్యవస్థలు ఎక్కడెక్క డున్నదీ పక్కగా పసిగట్టింది. ఆ వెంటనే గుక్కతిప్పుకోనివ్వని క్షిపణి దాడులతో వాటిని ధ్వంసం చేసింది.

తర్వాత పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసి చావుదెబ్బ తీసింది. రాడార్‌ వ్యవస్థలను కోల్పోయిన పాక్‌ నిస్సహాయంగా చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. పాక్‌ ఆర్మీ చీఫ్‌తో పాటు సైనిక ఉన్నతాధికారులు బ్యాంకర్లలో తల దాచుకోవాల్సి వచ్చింది. కేవలం డ్రోన్లను ఎరగా వేసి భారత్‌ ఇంతటి ఫలితాలు సాధించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement