
జనాభాను కష్టాల కడలిలోకి నెట్టేస్తున్న పోరాటాలు, యుద్ధాలు
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొద లు హమాస్, ఇజ్రాయెల్ పోరు, ఎర్రసముద్రంలో హౌతీల క్షిపణి దాడులదాకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పోరాటాలు, యుద్ధాలు, ఉద్యమాలు, సైనిక చర్యలతో ప్రపంచ జనాభాలో సగం మంది సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారని అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ల కారణంగా దక్షిణాసియాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొందని ‘‘సాయుధ సంక్షోభాలు, ప్రాంతాలు, సంఘటనలు(ఏసీఎల్ఈడీ)’’సంస్థ తెలిపింది.
స్వతంత్య్రంగా పనిచేసే లాభాపేక్షలేని ఏసీఎల్ఈడీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, సంక్షోభాల వివరాలతో ఒక నివేదికను రూపొందించింది. చాలా సంవత్సరాలుగా ఊహించనంతగా చాలా దేశాల్లో సంక్షోభాలు ఉన్నప్పటికీ కేవలం గత 12 నెలల్లో పరిణామాలను గమనిస్తేనే 50 దేశాల్లో 423 కోట్ల మంది ప్రజలు పలు రకాల సంక్షోభాలకు బాధితులుగా మిగిలిపోయారని గణాంకాలు ఘోషించాయి.
2024 డిసెంబర్నాటి ‘సంక్షోభ సూచీ’గణాంకాల ప్రకారం 10 దేశాలు అత్యంత సంక్షుభిత దేశాలుగా, 20 దేశాలు అతి, మధ్యస్థ స్థాయి సంఘర్షణలకు కేంద్రస్థానాలుగా తయారయ్యాయి. పాలస్తీనా 2024 ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత దయనీయమైన ప్రాంతంగా మారింది. మయన్మార్లో ఏకంగా 170 సాయుధ గ్రూప్లు క్రియాశీలకంగా ఉన్నాయి. ఉక్రెయిన్ సైతం దారుణమైన యుద్ధసంక్షోభాన్ని చవిచూస్తోంది.
ఎందుకీ సంక్షోభాలు?
పలు దేశాల్లో బలహీనమైన నాయకత్వం, మిత్రదేశం కోసం అప్పటికే జరుగుతున్న యుద్ధంలో కలగజేసుకోవడం, దేశాల మధ్య చెడిన సఖ్యత,మారిన ప్రభుత్వాల అంతర్జాతీయ విధానాలు, పొరుగు దేశాల పట్ల శత్రుభావన స్థాయిలో మార్పులు, దేశంలో చెలరేగిన విద్వేషాలను పొరుగుదేశాలు సొమ్ముచేసుకోవడం, ఉద్దేశపూర్వకంగా వైషమ్యాలను రెచ్చగొట్టి ఉద్యమాలకు తెరతీయడం వంటి పలు రకాల ఉదంతాలతో ఆయా దేశాల్లో ప్రజాజీవనం
అస్తవ్యస్థమవుతోంది. నిత్యావసరాలూ మృగ్యమయ్యాయి.
సహస్రాబ్దివేళ కాస్తంత శాంతించి..
1960 దశకంలో కలహాలతో సమస్యల వలయంలో చిక్కుకున్న దేశాల సంఖ్య 15గా ఉండేది. 1991 ఏడాదికి వచ్చేసరికి ఈ సంఖ్య ఏకంగా 53 దేశాలకు పాకింది. తర్వాత 2000 సంవత్సరానికి వైషమ్యాలు బాగా సమసిపోయాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని 2010 ఏడాదికల్లా 31 దేశాల్లో ఘర్షణలు, యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఇక 2023 ఏడాదికల్లా సమరంలో కత్తులు దూసుకుంటున్న దేశాల సంఖ్య రికార్డ్స్థాయిలో 59కి పెరిగింది.
మరణాల సంఖ్య సైతం ఇదే పంథాలో కొనసాగింది. 1960 ఏడాదిలో యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాల్లో 64,873 మంది ప్రాణాలు కోల్పోయారు. 1990 ఏడాదిలో ఏకంగా 80,297 మంది అమాయకులు చనిపోయారు. 2005 ఏడాదికి వచ్చేసరికి ఈ జగడాల్లో మరణాల సంఖ్య 12,150కి దిగివచ్చింది. ఇక ఉక్రెయిన్, రష్యా యుద్ధంసహా ప్రపంచవ్యాప్తంగా వైషమ్యాలు, దేశాల మధ్య కలహాలు కట్టుతప్పడంతో 2022 ఏడాదిలో మరణాలు రికార్డ్ స్థాయిలో 2.77 లక్షలను దాటేశాయి.
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఇప్పుడే అత్యధికం
‘‘ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాతి నుంచి చూస్తే విశ్వావ్యాప్తంగా దేశాల మధ్య రణాల గొణ ఇప్పుడే ఎక్కువగా ఉంది. దేశాల మధ్య గొడవలకు తోడు దేశీయంగానూ ఉద్యమాలు, అల్లర్లు, హింస కారణంగా మృత్యువు ఒడిలోకి చేరుతున్న అమాయక ప్రజల సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది’’అని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ప్రొఫెసర్ సిరి అసద్ రుస్తాద్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ఇప్పటికే సగం ప్రపంచ జనాభాకు సమరాల సెగ తగులుతోంది. ఈ విద్వేషాగ్ని ఇప్పట్లో చల్లారేలా లేదు. దాదాపు ఏడాదిన్నర యుద్ధం తర్వాత కూడా ఇజ్రాయెల్ ఆదివారం గాయాల గాజాపై మరింతగా క్షిపణులను ఎక్కుపెట్టడమే ఈ దారుణపర్వానికి ప్రబల తార్కాణం’’అని రుస్తాద్ వ్యాఖ్యానించారు. ఓవైపు చర్చలు జరుపుతూనే ఉక్రెయిన్పై మరోమారు భీకర స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడి రష్యా తన ఆక్రమణ జెండాను దించేదిలేదని తెగేసి చెప్పిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.