ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్ | I Dont work for Government Tharoor Praises Indias Operation | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్

May 25 2025 8:52 AM | Updated on May 25 2025 12:55 PM

I Dont work for Government Tharoor Praises Indias Operation

న్యూయార్క్: ‘నేను ‍ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్‌ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్‌ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్‌(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్‌లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్‌ భారత కాన్సులేట్‌లో ప్రసంగించారు.

పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.

అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో  ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్‌ పేర్కొన్నారు.

పహల్గామ్‌లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు  తదితరులు ఉన్నారు. 

ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement