నెలలో 1,000 విస్ఫోటాలు | Indonesia Mount Ibu erupts over 1,000 times in January | Sakshi
Sakshi News home page

నెలలో 1,000 విస్ఫోటాలు

Jan 23 2025 6:28 AM | Updated on Jan 23 2025 12:49 PM

Indonesia Mount Ibu erupts over 1,000 times in January

తూర్పు ఇండోనేషియాలో ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని మారుమూల ద్వీపం హల్మహెరాలోని ఇబూ అగ్నిపర్వతం ఈ జనవరి నెలలో కనీసం 1,000 సార్లు బద్దలైంది. గత ఆదివారం ఒక్కరోజే ఈ అగ్నిపర్వతం 17 సార్లు విస్ఫోటం చెందిందని ఇండోనేషియా జియోలాజికల్‌ ఏజెన్సీ అధికారులు సోమవారం ప్రకటించారు.

 విస్ఫోటం దాటికి అగ్నిపర్వతం సమీపంలో నివసిస్తున్న ఆరు గ్రామాల్లో మూడు వేల మంది గ్రామస్తులను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. పండించిన పంట చేతికొచ్చే సమయం కావడంతో చాలా మంది నివాసితులు ఖాళీ చేయడానికి విముఖత చూపుతున్నారు. అలాంటివారు సురక్షిత షెల్టర్లలో ఉండాలని అధికారులు సూచించారు. 

గత బుధవారం విస్ఫోటనంతో నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. పర్వతంలో జనవరి 1 నుంచి ఇప్పటి­వరకూ 1,079 విస్పోటాలు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన విస్ఫోటకం తీవ్రంగా ఉందని ఏజెన్సీ తెలిపింది. ‘స్థానిక కాలమానం ప్రకారం గత ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు 1.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘం గాల్లోకి ఎగిసింది. ఈ ధూళి మేఘం నైరుతి దిశగా విస్తరిస్తోంది. మౌంట్‌ ఇబు అబ్జర్వేషన్‌ పోస్ట్‌ వరకు పెద్ద శబ్దం వినిపించింది’’అని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు 
ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో మౌంట్‌ ఇబూ ఒకటి. గత జూన్‌ నుంచి విస్ఫోటాలు గణనీయంగా పెరిగాయి. దీంతో అగ్ని పర్వతం శిఖరం చుట్టూ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. మౌంట్‌ ఇబు సమీపంలో నివసిస్తున్నవారు, పర్యాటకులు మాస్క్‌ ధరించాలని సూచించారు. అధికారిక గణాంకాల ప్రకారం 2022 నాటికి హల్మహెరా ద్వీపంలో సుమారు 7,00,000 మంది నివసిస్తున్నారు.

 విస్తారమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా.. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ జోన్‌లో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లకు చిరునామాగా మారింది. గత నవంబర్‌లో పర్యాటక ద్వీపం ఫ్లోర్స్‌లోని 1,703 మీటర్ల ఎత్తయిన జంట శిఖరాల అగ్నిపర్వతం మౌంట్‌ లెవోటోబి లాకి–లాకీ ఒక వారంలో అనేక మార్లు విస్ఫోటనం చెందింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రువాంగ్‌ పర్వతం గతేడాది ఆరుసార్లు విస్ఫోటనం చెందడంతో సమీప ద్వీపాల నుంచి వేలాది మందిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement