
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో నవంబర్లో సైన్యం జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులంతా తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధం కలిగినవారు.
ఇటీవల తీవ్రవాద గ్రూపుల దాడులను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలు తీవ్రవాద గ్రూపులపై గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ల కింద నవంబర్ నెలలో 199 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వీరిలో నిషేధిత సంస్థలకు చెందిన 24 మంది కీలక కమాండర్లు ఉన్నారన్నారు. హతమైన కమాండర్లలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని, వీరి కోసం చాలా కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో మతపరమైన హింసలో మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 130కి పెరిగింది. కుర్రం జిల్లాలో వరుసగా పదకొండో రోజు కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అలీజాయ్- బగన్ తెగల మధ్య ఘర్షణలు నవంబర్ 22న ప్రారంభమయ్యాయి. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, హింస కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment