
ఆలయంలో విచారణ జరుపుతున్న పోలీసు అధికారులు
కొండగట్టు(చొప్పదండి): ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన, ఏళ్లచరిత్రగల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిదింది. చోరీ చిన్నదే అయినా.. ఆలయ చరిత్రలో తొలిసారి కావడం కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. అయితే, కొద్దిరోజుల తేడాతోనే దొంగలు చోరీకి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది.
దొంగతనం జరిగింది ఇలా..
శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడ్డారు. 2.20గంటల వరకు తమ పనికానిచ్చేశారు. తొలుత ఆలయం వెనకాల ద్వారాల తాళాలు పగుల గొట్టారు. అనంతరం అంతరాలయంలోకి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న తలుపుల పట్టీలు తొలగించి లోనికి ప్రవేశించారు. గర్భాయంలోని స్వామివారి కిరీటం, మకర తోరణం, శ్రీరామ రక్షగొడుగులు, మకర తోరణ స్తంభం, రెండు శఠగోపాలు, కవచం, అంతారాలయ తోరణాలు, ,శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయలోని మరోరెండు శఠగోపాలు, మరికొన్ని వస్తువులను అపహరించారు. ఆలయంలోని హనుమాన్ విగ్రహంపై గల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్ష తోకవారం, పదుకలు, ఉత్సవమూర్తి, అంతరాలయంలని తోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండి తోరణం, పాదుకలు, శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువుల జోలికి వెళ్లలేదు. మొత్తంగా 15కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వీటి విలువ సుమారు రూ.9లక్షల విలువ ఉంటాయని ఈవో వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
ఆలయానికి పటిష్టమైన భద్రత లేదు. ఉన్న ఒక అధికారి కూడా రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండడంలేదు. దీంతో సిబ్బంది తమకు ఇష్టమైనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు నిత్యం గర్భాలయంలోకి రావడం, వారితోనే అధికారులు, అర్చకులు వివిధ పనులు చేయించుకోవడం, అధికారులు, సిబ్బంది చేయాల్సిన విధులను సెక్యూరటీ గార్డులు, ఇతర వ్యక్తులతో చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవో, ఆలయ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లోపం కారణమని అంటున్నారు. మొత్తంగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడం లోపంగా కనిపిస్తోంది.
12మందితో సెక్యూరిటీ..
ఆలయంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు 12మంది హోంగార్డులు ఉన్నారు. వీరు ఉదయం 6గంటల – 6 గంటల వ రకు ఆరుగురి చొప్పున విధులు నిర్వర్తిస్తారు. రాత్రివేళలో న లుగురు విధుల్లో ఉంటారు. రోజూ మాదిరిగానే రాత్రి వరకు ఓ హోంగార్డు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రపరచడానికి వెళ్లిన స్వీపర్లు.. గర్భాయంలో కోతులు ఉండటం, సామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడాన్ని గమనించారు. వెంటనే ఆలయ ఉపప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆలయ ఈవో వెంకటేశ్కు సమాచారం అందించారు. ఆలయ ఈవో ఘటపై పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన డాగ్స్క్వాడ్..
సమాచారం అందుకున్న పోలీసులు.. ఆలయానికి చేరుకున్నారు. భేతాళస్వామి ఆలయ పరిసరాల్లో డాగ్స్క్వాడ్తో తని ఖీలు చేశారు. సాగర్ గెస్ట్హౌస్ సమీపంలో హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్ను వారికి దొరికింది. ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, సైబర్ టీం ఆల య పరిసరాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. భక్తు ల కోరికలు తీర్చే అంజన్న ఆలయంలోనే చోరీ జరగడం బాధాకరమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామన్న సమయంలో ఇలా దొంగతనం జరగడం విషాదకరమన్నారు.
10 ప్రత్యేక బృందాలతో గాలింపు
డీఎస్పీ ప్రకాశ్ నేతృత్వంలో 10 ప్రత్యేక పోలీసు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. ఆలయంలో దొంగతనం జరగడం చాలా బాధాకరం. ప్రాయశ్చిత్తం కోసం హోమం, మూడు దేవతలకు 11లీటర్ల పాలతో అభిషేకం, 1008 నామాలతో పూజలు నిర్వహించాం. ఆ తర్వాతనే భక్తులకు అనుమతించాం.
– జితేంద్రప్రసాద్, అర్చకుడు, కొండగట్టు ఆలయం
Comments
Please login to add a commentAdd a comment