● గతంలో 39.99 లక్షల పని దినాలు ● వచ్చే సంవత్సరం 37.85 ల
జగిత్యాల: గ్రామీణప్రాంతాల్లో వలసలు నియంత్రించేందుకు 20ఏళ్ల క్రితం అప్పటి కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దీనిద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించి ఏటా ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది 2025–26కు కూడా ప్రణాళిక రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 37.85 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 20 మండలాల్లో రూ.82.3 కోట్ల వ్యయంతో 37.85 లక్షల పనిదినాలు కల్పించనున్నారు. కూలీలకు రోజుకు రూ.300 గిట్టుబాటు అయ్యేలా చూశారు. ప్రతిపాదించిన నిధుల్లో కూలీలు చేసిన పనులకు అధిక వ్యయం అవసరం కాగా మెటిరియల్ కాంపోనెంట్ కింద స్వల్ప నిధుల వ్యయం అయ్యేలా ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టనున్నారు.
జలసంరక్షణకే ప్రాధాన్యత..
వేసవికాలం ఉపాధిహామీ పథకంలో ముఖ్యంగా భూగర్బజలాలు పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిచోటా ఇంకుడు గుంతలు, వాటర్షెడ్స్, చెక్డ్యామ్స్, పంట కాలువలు, నీటి కుంటలు, చెరువుల్లో పూడికతీత, అడవుల్లో కాంటూర్ కందకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పొలాలకు అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
తగ్గిన పనిదినాలు
గతేడాది జిల్లాలో 39.99 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 35.91 లక్షల రోజులు పని కల్పించారు. ఆర్థిక సంవత్సరానికి మరో నెల గడువు ఉన్నందున ఆ లోపు లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మాత్రం కేవలం 37.85 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించనున్నారు. ఈ సారి కూలీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పనిదినాలు తక్కువ కావడంతో అధికారులు ఏ విధంగా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కూలీలకు ఈసారి ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రకటించడం తెలిసిందే. ఇందులో కనీసం నెల రోజుల పాటు ఉపాధి పనులకు వెళ్లిన కూలీలను అర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. దీంతో జాబ్కార్డు కలిగి ఉండి ఇప్పటి వరకు పనులకు వెళ్లని వారు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ఈసారి ఉపాధి పనులకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. కానీ గత సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనిదినాలు తక్కువ చేశారు. పెంచాల్సిన పనిదినాలను అధికారులు తగ్గించడంతో ఈసారి కూలీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని పనిదినాలు కల్పించాలని డిమాండ్ వస్తోంది. రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో చాలామంది జాబ్కార్డులు ఉన్నవారు ఈసారి ప్రతిఒక్కరూ పనులకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఉపాధి కల్పనతోపాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రానుంది.
ఉపాధిహామీ కూలీలు
ఏడాది 2024–25 2025–26 పనిదినాలు 39.99 లక్షలు 37.85లక్షలు పూర్తయినవి 35.92 లక్షలు
జాబ్కార్డ్స్ ఉన్నవారు 1,05,713
కూలీలు 1,46,477
మండలాలు : 20
గ్రామపంచాయతీలు : 380
Comments
Please login to add a commentAdd a comment