
రంగస్థలంపై మరో వసంతం
● నేడు చైతన్య కళాభారతి 40వ వార్షికోత్సవం ● కరీంనగర్ కళాభారతిలో వేడుకలు
● ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటిక 40వ ప్రదర్శన
విద్యానగర్(కరీంనగర్): నాటకం సమాజంలో బాధ్యత కలిగిన ఒక హామీ. గుణాత్మకమైన బలాన్ని ఇస్తుంది. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నాటకల ప్రదర్శనల ద్వారా సమాజ చైతన్యానికి చైతన్య కళాభారతి కృషి చేస్తోంది. నాటక రంగంపై మక్కువ ఉన్న కరీంనగర్కు చెందిన నాటక రచయిత స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ 1985లో చైతన్య కళాభారతి సంస్థను ప్రారంభించారు. నాటి నుంచి నాటక రంగంలో 40మంది కళాకారులతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. 40 వసంతాలు పూర్తి చేసుకుని, శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో వేడుకలు జరుపుకుంటోంది.
40 ఏళ్ల ప్రస్థానం
వ్యవసాయశాఖలో పనిచేసే స్వర్గీయ శ్రీరాముల సత్యనారాయణ నాటకరంగంపై ఉన్న మక్కువతో స్వర్గీయ వొడ్నాల కిషన్, కునమల్ల రమేశ్, తిప్పర్తి ప్రభాకర్, బండారి శ్రీరాములు, బండారి రవీందర్, సింహాచలం, యతిందర్తో కలిసి 1 మే 1985లో చైతన్య కళాభారతి నాటకసంస్థను స్థాపించారు. 1985 జూన్లో ఈతరం మారాలి అనే నాటకాన్ని ఎస్సారార్ కళాశాల వేదికగా తొలిసారిగా ప్రదర్శించారు. శ్రీరాముల సత్యనారాయణ రచించిన పామరులు, ఈ తరం మారాలి, ఆకలి వేట, ఆడది, మనిషి, నిరసన, కాల చక్రం, ప్రేమ పిచ్చోళ్లు, చదవరా, ఆశాపాశం, అగ్ని పరీక్ష నాటకాలు ప్రశంసలు పొందగా, చైతన్య కళాభారతి కళాకారులు 700లకు పైగా ప్రదర్శనలిచ్చారు. వొడ్నాల కిషన్ రచనల్లో విధాత, సారాయి, కాపురం, నాకు ఇల్లొచ్చింది నాటికలు 100కు పైగా ప్రదర్శనలు జరిగాయి. పరమాత్ముని శివరాం రచన, మంచాల రమేశ్ దర్శకత్వంలో దొంగలు నాటిక 148 ప్రదర్శనలు, ఈ లెక్క ఇంతే నాటిక 37 ప్రదర్శనలు, ఖరీదైన జైళ్లు నాటిక 24 ప్రదర్శనలు, చీకటిపువ్వు 66 ప్రదర్శనలు, స్వప్నం రాల్చిన అమృతం నాటిక 40ఏళ్ల వేడుకల్లో 40వ ప్రదర్శన అవుతుంది. చెల్లని పైసలు, దొంగలు, చీకటిపువ్వు నాటికల ద్వారా ఆరు నంది అవార్డులు చైతన్య కళాభారతి అందుకుంది.
4న వేడుకలు
చైతన్య కళాభారతి 40వ వార్షికోత్సవం 4వ తేదీ శుక్రవారం కళాభారతిలో సాయంత్రం 6.30కు జరుగుతాయని ఆ సంస్థ అధ్యక్షుడు తిప్పర్తి ప్రభాకర్ తెలిపారు. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, గౌరవ అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రత్యేక అతిథిగా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్బాబు పాల్గొంటారని తెలిపారు. స్వప్నం రాల్చిన అమృతం నాటక ప్రదర్శనతో పాటు కళారంగంలో రాణిస్తున్న వారికి స్మారక పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
నెహ్రూ యువ కేంద్ర కో– ఆర్డినేటర్ ప్రోద్బలంతో..
1985లో అప్పటి కరీంనగర్ నెహ్రు యువ కేంద్ర కో–ఆర్డినేటర్ రామారావు ప్రోద్బలంతో చైతన్య కళాభారతి నాటక సంస్థను ప్రారంభించాం. నెల్లూరులో జరిగిన నాటిక పోటీల్లో సినీనటి సుమలత చేతుల మీదుగా బెస్ట్ విలన్ అవార్డు అందుకున్నా. రవీంద్రభారతిలో విధాత నాటికకు అవార్డును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అందుకున్నా.
– తిప్పర్తి ప్రభాకర్, చైతన్య కళాభారతి అధ్యక్షుడు
ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దాం
కళాకారుడిగా నాటక రంగంపై ఉన్న మక్కువతో చైతన్య కళాభారతి సంస్థను ప్రారంభించాం. మా సంస్థ ద్వారా ఎన్నో నాటకాలు ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రదర్శించి, అవార్డులు, బహుమతులు అందుకున్నాం. చైతన్య కళాభారతి సంస్థ ఎప్పటికీ కొనసాగాలన్నదే మా ధ్యేయం. అందుకే కొత్త కళాకారులకు అవకాశం కల్పిస్తున్నాం.
– కునమల్ల రమేశ్బాబు, చైతన్య కళాభారతి వ్యవస్థాపక సభ్యుడు
నాటక రంగంలో ప్రత్యేక అధ్యాయం
వ్యవసాయశాఖలో ఉద్యోగం చేస్తున్న నేను నాటక రంగం అంటే ఇష్టంతో శ్రీరాముల సత్యనారాయణ ప్రోత్సాహంతో చైతన్య కళాభారతి ద్వారా మనిషి నాటికలో నటించాను. చైతన్య కళాభారతి ద్వారా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, కావలి నుండి కర్నూలు వరకు ఉన్న నాటక వేదికలపై వందలాది ప్రదర్శనలిచ్చి ఎన్నో బహుమతులు, అవార్డులు, రివార్డులు అందుకున్నాను.
– గద్దె ఉదయ్ కుమార్, చైతన్య కళాభారతి కోశాధికారి
ఉత్తమ అవార్డు అందుకున్న
పరమాత్ముని శివరాం రచన, మంచాల రమేశ్ దర్శకత్వంలో ఖరీదైన జైళ్లు నాటిక 24 ప్రదర్శనలు ఇవ్వగా అందులో ఉత్తమ సహాయ నటి, ఉత్తమ నటి అవార్డులు అందుకోవడం జరిగింది. ఈ సంస్థ ఉమ్మడి రాష్ట్రాల్లో ఇచ్చిన అనేక నాటిక ప్రదర్శనల్లో నేను వివిధ పాత్రల్లో నటించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అనేక ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనల్లో అవార్డులు అందుకున్నా.
– శోభ, రంగస్థల నటి, సభ్యురాలు

రంగస్థలంపై మరో వసంతం

రంగస్థలంపై మరో వసంతం

రంగస్థలంపై మరో వసంతం

రంగస్థలంపై మరో వసంతం

రంగస్థలంపై మరో వసంతం