ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి

Published Tue, Feb 11 2025 1:34 AM | Last Updated on Tue, Feb 11 2025 1:34 AM

ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి

ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి

డోర్నకల్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం జోగ్యాతండాలో అమానుషం జరిగింది. తల్లి తన కుమారుడు, కుమార్తెకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించింది. ఇద్దరు చిన్నారులు హైదరాబాద్‌లోని నీలో ఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లల నానమ్మ ఫిర్యాదుతో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగ్యాతండాకు చెందిన ఆటోడ్రైవర్‌ వాంకుడోత్‌ వెంకటేశ్‌కు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన ఉషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి వరుణ్‌తేజ్‌, నిత్యశ్రీ చిన్నారులు ఉన్నారు. వెంకటేశ్‌ అనారోగ్యంతో నాలుగు నెలల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం ఉష తన పిల్లలతో వెంకటేశ్‌ తల్లిదండ్రులు వాంకుడోత్‌ శ్రీను, బుజ్జి ఇంటిలోని ఓ గదిలో నివాసం ఉంటుంది. ఈ నెల 5న ఉష బయటకు వెళ్లిన సమయంలో వరుణ్‌తేజ్‌, నిత్యశ్రీ ఆడుకుంటూ ఒక్కసారి కిందపడి వాంతులు చేసుకున్నారు. నానమ్మ బుజ్జితోపాటు బంధువులు పిల్లలను పరిశీలించగా ఆకుపచ్చ రంగులో వాంతులు చేసుకుంటుండగా ఏమైందని అడగగా, అమ్మ కూల్‌డ్రింక్‌ తాగించిందని తెలిపారు. ఉష ఇంటికి రాగానే పిల్లలను ఖమ్మంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు చికిత్స అందించిన వైద్యులు పిల్లల శరీరాల్లో పురుగుమందు ఆనవాళ్లు ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేయడంతో బంధువులు, కుటుంబసభ్యులు ఉషను నిలదీశారు. దీంతో ఆమె పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగించినట్లు ఒప్పుకుంది. బంధువులు ఉష ఇంట్లో వెతకగా అరలీటర్‌ గడ్డి మందు డబ్బా లభ్యమైంది. పిల్లల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారుల్లో నిత్యశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

విచారణ చేస్తున్నాం..

పిల్లలకు గడ్డి మందు తాగించిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డోర్నకల్‌ సీఐ బి.రాజేశ్‌ తెలిపారు. సిబ్బందిని హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి పంపి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

తల్లి ఆత్యహత్యాయత్నం...

పిల్లలకు గడ్డిమందు తాగించినట్లు అందరికీ తెలియడంతో మూడు రోజుల క్రితం ఉష ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకుని సోమవారం నీలోఫర్‌ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులు

నానమ్మ ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి..

అందరికీ తెలిసిందని తల్లీ ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం జోగ్యాతండాలో ఘటన

నానమ్మ ఫిర్యాదుతో వెలుగులోకి..

పిల్లలకు గడ్డిమందు తాగించినట్లు తల్లి ఒప్పుకోవడంతో పిల్లల నానమ్మ బుజ్జి సోమవారం డోర్నకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బుజ్జి విలేకరులతో మాట్లాడుతూ తమ కోడలు ఉష ప్రవర్తనపై తమకు అనుమానాలు ఉన్నాయని, తన స్వేచ్ఛకు పిల్లలు అడ్డుగా ఉన్నారనే వారికి గడ్డి మందు తాగించిందని ఆరోపించింది. తన కుమారుడు వెంకటేశ్‌ మృతి పట్ల కూడా అనుమానాలు ఉన్నాయని, ఉషకు సంబంధించి సెల్‌ఫోన్‌ డేటాను పరిశీలించాలని బుజ్జి డిమాండ్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement