మిగిలింది 20 రోజులే.. | - | Sakshi
Sakshi News home page

మిగిలింది 20 రోజులే..

Published Tue, Mar 11 2025 1:17 AM | Last Updated on Tue, Mar 11 2025 1:18 AM

మిగిల

మిగిలింది 20 రోజులే..

మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే

నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్‌ అధికార యంత్రాంగం డిజిటల్‌ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, వాట్సప్‌ నంబర్‌, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్‌ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు.

80 శాతంతో నాలుగో స్థానం..

రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు.

రాష్ట్రస్థాయిలో 63వ స్థానం..

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ.1.94 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్‌లో సైతం 6,406 ఆస్తులకు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది.

అదనపు కలెక్టర్లకు బాధ్యతలు..

ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్‌ బాడీస్‌) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్‌ రెవెన్యూ, బిల్‌ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్‌ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్‌ పిటిషన్‌ సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం సోమ, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్‌, ఇంటి నంబర్‌ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు.

ఉమ్మడి జిల్లా పరిధిలో ఆస్తులు పన్నులు, వసూలు (రూ.కోట్లలో)

సీఎం ఇలాఖాలో 57 శాతమే

వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం

ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లే దిక్కు

ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు

గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న

ప్రత్యేకాధికారులు

లక్ష్యం చేరుకుంటాం..

ప్రతి ఏడాది మార్చిలోనే అత్యధికంగా పన్నులు వసూలు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు, వ్యాపారులు త మ ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలి. గత వా రం రోజులుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. – భోగేశ్వర్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, నారాయణపేట

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు లేక..

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు బిల్‌ కలెక్టర్లు, వార్డు అధికారులే దిక్కయ్యారు. మున్సిపాలిటీల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో పన్నుల వసూలు చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో ప్రధాన మున్సిపాలిటీల్లో తప్పా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని సమాచారం. పన్నులు ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మిగిలింది 20 రోజులే.. 1
1/2

మిగిలింది 20 రోజులే..

మిగిలింది 20 రోజులే.. 2
2/2

మిగిలింది 20 రోజులే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement