
‘ఓపెన్’ అక్రమాలకు కళ్లెం పడేనా?
నిబంధనలకు విరుద్ధంగా..
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో చూచిరాతలు, మాస్ కాపీయింగ్కు పాల్పడిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో అక్రమాలకు కొందరు చక్రం తిప్పుతున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు(డీవో), ఇన్విజిలేటర్లను తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు విద్యాశాఖ అధికారుల వద్ద పావులు కదుపుతున్నారు. కాగా, ప్రతి ఏడాది వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా చేసేందుకు పోటీ ఎక్కువగా ఉంటోంది. వేసవిలో వచ్చే సంపాదిత సెలవుల (ఈఎల్స్) కోసం ఉపాధ్యాయులు పోటీ పడుతుంటారు. పరీక్షా కేంద్రాల్లో చూచిరాతలనూ ప్రోత్సహిస్తుంటారనే ఆరోపణలున్నాయి.
ఒక్కొక్కరి నుంచి రూ.600 వసూలు
నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాలలో సింహభాగం కేంద్రాలు చూచిరాతలకు అడ్డాగా మారాయి. గతేడాది ఆర్మూర్ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.600 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సర తప్పిదాలు పునరావృతం కాకుండా ఇటీవల అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ఈసారైనా చూచిరాతలకు పుల్స్టాప్ పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచే శాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో 4,600 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. డీఈవో ఆధ్వర్యంలో సీఎస్లు, డీవోలకు అవగాహన కల్పించాం. శనివారం ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పిస్తారు. ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేర్చాం. ఈసారి ఈఎల్స్ ఇవ్వడం లేదు. కొందరు ఇన్విజిలేటర్లను కూడా మార్చాం. చూచిరాతలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
– రవీందర్, జిల్లా కోఆర్డినేటర్,
ఉమ్మడి నిజామాబాద్
రేపటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ,
ఇంటర్ పరీక్షలు
సమన్వయకర్తలు చెప్పిన వారికే
సీఎస్, డీవో విధులు
మూడేళ్లుగా అనుకూలమైన
వారే ఇన్విజిలేటర్లు
పైరవీలకు పెద్దపీట వేస్తున్న
విద్యాశాఖాధికారులు
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలో 17, కామారెడ్డి జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్ల జాబితా పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఏడాది కూడా జాబితాను పబ్లిక్ డొమైన్లో ఇంకా పెట్టలేదు. గత మూడేళ్లుగా జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లోని పరీక్షా కేంద్రాల్లో పాత వారినే సీఎస్, డీవోలుగా నియమిస్తున్నారు. ఈ సెంటర్లకు సంబంధించి వేల్పూర్, జక్రాన్పల్లి, ఆర్మూర్, భీంగల్కు చెందిన దాదాపు 10 మంది ఉపాధ్యాయులు ఐదేళ్లుగా డ్యూటీలు చేస్తున్నారు. ఇందులో ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి చెందిన డివిజన్ నాయకుడు చక్రం తిప్పుతున్నాడనేది బహిరంగ రహస్యంగా చెప్పవచ్చు. అలాగే ప్రతి కేంద్రంలో అవసరానికి మించి ఎక్కువ మందికి డ్యూటీలు వేయడంతో వారిలో చాలా మంది కేంద్రాలకు రాకుండానే డ్యూటీ సర్టిఫికెట్లు పొందుతూ సంపాదిత సెలవులు పొందుతున్నారు. గత మూడేళ్లుగా పై నాలుగు మండలాల ఎంఈవోలు తీసిన ఉత్తర్వు కాపీలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తే అవకతవకలు బయటపడుతాయని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో గతేడాది 13 మంది ఇన్విజిలేటర్లకు డ్యూటీ వేయగా అందులో 10 మందికి గత మూడేళ్లుగా సెంటర్లు మారుస్తూ డ్యూటీ వేస్తున్నారు. జిల్లాలో చాలా కేంద్రాల్లో పాత వారికే డ్యూటీలు వేస్తూ చూచిరాతలు నడిపిస్తున్నట్లు సమాచారం.