
● త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ● ఇక ఓటరు నమోదు నిరం
కరీంనగర్అర్బన్: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల సంఘం ఓటరు నమోదును నిరంతర ప్రక్రియగా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కటాఫ్ తేదీని ఖరారు చేసి తుది ఓటరు జాబితాగా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడమే మేలు.
నిరంతర ప్రక్రియ
గతంలో ఓటర్ల నమోదుకు జనవరి1 తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సదరు తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత లభించేది. సదరు విధానానికి స్వస్తి పలికారు. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకోవాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. జాబితాలో లాజికల్ పొరపాట్లు, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తిస్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించింది.
ఓటరు నమోదుకు పలు మార్గాలు
అరచేతిలోనే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తప్పులను సరిచేసుకోవడానికి, ఓటు హక్కును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకోవడానికి, జాబితాలో రెండు ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగింపు, ఇతర అంశాలకు సంబంఽధించి వేర్వేరుగా ఫారం–6, ఫారం–7, ఫారం–8 కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి అందులో పొందుపర్చాల్సిన వివరాలు నమో దు చేసి సబ్మిట్ చేయాలి. వివరాలు ఏఈఆర్వోకు వద్దకు వెళ్తాయి. పరిఽశీలించి ఆమోదిస్తారు.
యాప్తో కూడా..
వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో http:/// voters. eci. gov. in యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా లేదా చూసుకునే అవకాశం కల్పించారు.
గుర్తింపు కార్డు పొందడమిలా
ఓటరు గుర్తింపు కార్డు కావాలనుకునేవారు వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో ఈ–ఎపిక్ కార్డు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మొబైల్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తింపు కార్డుకు ఫోన్ నంబర్ అనుసంధానం అయితే ఓటీపీ వస్తుంది. లేకుంటే రాదు. ఫారం–8 ద్వారా ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నమోదుపై సందేహమా.. 1950
ఓటరు నమోదు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు. అంతేకాకుండా అంతర్జాలం నుంచి ఈమెయిల్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
ఫారం–6: కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఈ దరఖాస్తును పూరించాలి. ఒక ఫొటో, వయసు నిర్ధారణ పత్రం(ఎస్సెస్సీ మెమో), చి రునామా ధ్రువీకరణ ఉండే కరెంట్ బిల్లు, నల్లా బిల్లు, ఇంటి పన్ను వంటి వాటిని జతచేయాలి.
ఫారం–6ఏ: విదేశాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఫార్మాట్ రూపొందించారు. ఎన్నారైలకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 నుంచి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఫారం–7: ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఈ ఫారంను పూరించాలి. ఓటరు మరణించినా, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డా వారిని జాబితా నుంచి తొలగించాలని ఈ ఫారం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ఫారం–8ఏ: పట్టణాల్లో చాలామంది ఒక కాలనీ నుంచి మరో కాలనీకి మారుతుంటారు. ఈ క్రమంలో ఓటు వేసేటప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. వారి కోసం ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఒక పోలింగ్బూత్ నుంచి మరో సమీప పోలింగ్ బూత్కు మారేందుకు దరఖాస్తు చేయాలి.