
కోలారు: కాంగ్రెస్ అధిష్టానం కోలారు కాంగ్రెస్ టికెట్పై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించింది. కొత్తూరు మంజునాథ్కు టికెట్ ఇవ్వడం ద్వారా సిద్దరామయ్యకు రెండో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. సిద్దరామయ్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వక పోవడంపై కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కార్యాలయంలోని కుర్చీలను విరగగొట్టి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్సీ అనిల్కుమార్పై వాగ్వాదానికి దిగారు. సిద్దరామయ్యను కోలారు నుంచి పోటీ చేయిస్తానని బీరాలు పలికిన అనిల్ కుమార్ మంజునాథ్కు టికెట్ ఇస్తే ఎలా ఊరుకున్నారని నిలదీశారు.
బ్యాలహళ్లి గోవిందగౌడకు నిరాశ
కోలారు నుంచి సిద్దరామయ్య పోటీ చేయకపోతే తనకే టికెట్ ఇవ్వాలని భీష్మించిన డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు బ్యాలహళ్లి గోవిందగౌడకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడిన వీఆర్ సుదర్శన్ కూడా పార్టీకి దూరమయ్యారు, రాహుల్ గాంధీ కార్యక్రమానికి కూడా హాజరు కానని తన అక్కసును వెళ్లగక్కారు.