
‘గడ్డి మందు’పై పోరాటం
● పారాక్వాట్ నిషేధానికి డాక్టర్ల సంఘం ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశంలో ఎంతోమంది నిండు ప్రాణాలను బలితీసుకుంటున్న గడ్డి మందు(పారా క్వాట్) నిషేధమే లక్ష్యంగా పోరాటానికి ఓ సంఘం ఏర్పాటైంది. రాష్ట్రంలో పలువురు ప్రైవేట్ వైద్యులు కలిసి ‘డాక్టర్స్ అసోసియేషన్ అగెనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్’ పేరుతో ఓ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించారు. మంచిర్యాల కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన డాక్టర్ సతీశ్ నారాయణచౌదరి, ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన డాక్టర్ రాకేశ్ చెన్న, ప్రధాన కార్యదర్శిగా వరంగల్కు చెందిన డాక్టర్ మానస మామిడాలతో సహా మరో ఆరుగురి వైద్యులతో కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. క్షణికావేశంలో గడ్డి మందు తాగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అనేక దేశాల్లో నిషేధించినా ఇక్కడ విరివిరిగా వాడకంతో అనర్థాలున్నాయని పేర్కొన్నారు. ఈ విష రసాయన అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు, పౌరులు తమతో కలిసి రావాలని కోరారు.