2 నుంచి కార్తిక మాస దీక్షా అభిషేకాలు
మోపిదేవి: రాష్ట్రంలో ఎంతో ప్రాశస్త్యం గల కృష్ణాజిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నవంబర్ 2 నుంచి డిశంబర్ 1వ తేదీ వరకు నెల రోజులపాటు దీక్షా అభిషేకాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా నవంబర్ 5వ తేదీ మంగళవారం నాగుల చవితి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగుల చవితికి తెల్ల వారుజామున 2.30 గంటలకు ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు నాగపుట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం భక్తులకు నాగపుట్ట దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం 8 గంటలకు స్వామివారికి బాల భోగ నివేదన అనంతరం స్వామి దర్శనం, సాయంత్రం 6.30 గంటలకు మహా నివేదన, పంచహారతులు, నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వినియోగం ఉంటాయి. నవంబర్ 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణం ఏర్పాటు ఉంటుంది. నవంబర్ 29వ తేదీ శుక్రవారం కార్తికమాస శివరాత్రి సందర్భంగా లోకకల్యాణార్థం శ్రీ వల్లీదేవసేనసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి లక్షబిల్వార్చన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష బిల్వార్చన సందర్భంగా 29, 30 తేదీల్లో స్వామివారికి జరిగే అభిషేకం తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్లు ఆలయ డీసీ శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని బయట విద్యుత్ దీపాలతోనూ, లోపల పూలతో అందంగా అలంకరించారు.
నవంబర్ 5న నాగుల చవితి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment