
వ్యూహాత్మక ప్రణాళికతో ‘సహకారం’ బలోపేతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళికతో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏడాదంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం 4వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ (డీసీడీసీ) సమావేశం వర్చువల్గా జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ‘సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించారన్నారు. సహకార, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయం, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సామాజిక–ఆర్థిక అసమానతలను రూపుమాపడం తదితర లక్ష్యాల సాధనలో సహకార రంగం పోషిస్తున్న పాత్ర, సహకార ఉద్యమం ప్రాధాన్యం, సహకార సంఘాల ప్రయోజనాలు తదితరాలను తెలియజెప్పేలా సదస్సులు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, కార్యశాలలు నిర్వహించాలన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు పరపతితో పాటు వివిధ అవసరాలను తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పోషిస్తున్న పాత్రపై హైస్కూల్ స్థాయిలో వ్యాస రచన పోటీలు నిర్వహించాలన్నారు. డీసీఎంఎస్ పాత్రపై జిల్లాస్థాయిలో వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు.
వేగంగా డిజిటలీకరణ..
జిల్లాలో 131 పీఏసీఎస్లలో 99 పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. డీసీఓ, డీసీడీసీ సభ్య కన్వీనర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పౌర సరఫరాల మేనేజర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
డీసీడీసీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్