ఇ విధానంలో త్వరితగతిన మెటీరియల్ విడుదల
ఈ–స్టోర్తో త్వరితగతిన
మెటీరియల్ విడుదల
ఈ–స్టోర్ విధానంతో త్వరితగతిన మెటీరియల్ విడుదలవుతోంది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఆన్లైన్కు ముందు సెక్షన్ ఏఈ పేపర్పై అవసరమైన మెటీరియల్ జాబితా తయారు చేసుకుని ఏడీఈ వద్దకు వెళ్లి అనుమతి తీసుకుని స్టోర్లో అందించేవారు. ఇది వ్యయప్రయాసాలతో కూడుకున్న అంశం. ఈ–స్టోర్తో అంతా ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి.
–పి.మధుసూదన్ రావు,
ఎస్ఈ, హనుమకొండ
సకాలంలో పనులు
పూర్తవుతున్నాయి
ఈ–స్టోర్ అమలుతో సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. కాలయాపన లేదు. పేపర్ ద్వారా జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ –స్టోర్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో విద్యుత్ శాఖ, వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతోంది.
–కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్
హన్మకొండ : విద్యుత్ శాఖలో ఒకప్పుడు పనులు కావాలంటే కాగితాల ద్వారా జరిగేవి. ఈ విధానం వ్యయప్రయాసాలతో కూడుకున్న అంశం. ఎందుకంటే ఒక అధికారి నుంచి మరో అధికారికి, అతడి నుంచి ఉన్నతాధికారికి ఇలా.. రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టేది. ఫలితంగా పనులు ఆలస్యంగా జరిగేవి. దీంతో అధికారులతోపాటు వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ మండలి సాంకేతిక వినియోగానికి పెద్దపీట వేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న టెక్నాలజీని కంపెనీ అందిపుచ్చుకుంటూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఈ–స్టోర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇంతకు ముందు కాగితాల(పేపర్) ద్వారా పనులు జరిగేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఒకే రోజు అది కూడా గంటల్లో పనులు జరిగిపోతాయి. ఈ విధానంలోనే ఎన్పీడీసీఎల్లో మెటీరియల్ విడుదలకు ఈ–స్టోర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
పేపర్ విధానంలో మెటీరియల్ విడుదల
తీవ్ర కాలయాపన..
ప్రతీ ఉమ్మడి జిల్లా స్థాయిలో విద్యుత్ మెటీరియల్ స్టోర్ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఏ అభివృద్ధి పనులు జరిగినా ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లాలి. అయితే మెటీరియల్ విడుదలకు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సెక్షన్ ఏఈ అవసరమైన ఇండెంట్ పెడుతారు. ఇది ఇక్కడి నుంచి ఏడీఈకి వెళ్తుంది. ఏడీఈ అనుమతితో స్టోర్కు చేరుకుంటుంది. అప్పుడు మెటీరియల్ విడుదలవుతుంది. పేపర్ విధానంలో ఇన్ని స్టేజీలు దాటాలంటే ఎంత సమయం పడుతుందో అంచనా వేయొచ్చు. పేపర్ ద్వారా మెటీరియల్ విడుదలలో ఆలస్యం జరుగుతుండడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ ఈ –స్టోర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ–స్టోర్తో సమయానికి మెటీరియల్ చేతికి..
ఈ–స్టోర్ విధానంలో సంబంధిత సెక్షన్ ఏఈ మొదట ఒక పనికి కావాల్సిన మెటీరియల్స్ స్టాక్ ఉందో లేదో సాప్ (ఎస్.ఎ.పి) సాఫ్ట్వేర్లో ఆన్లైన్లో చూసుకుని రిజర్వ్ చేసుకుంటారు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్స్ తాలూకు సమాచారం ఎస్.ఎ.పి వర్క్ ఫ్లో ద్వారా సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్కి వర్క్ ఫ్లో ద్వారా ఆన్లైన్లో వెళ్తుంది. మెటీరియల్స్ స్వీకరించే అధికారికి, ఏ రోజు మెటీరియల్స్ విడుదల చేస్తారో.. ఆ తేదీని, సమయాని ఎస్ఎంఎస్, ఎస్.ఎ.పి మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్కు చేరుకుని మెటీరియల్ తీసుకెళ్తారు. తద్వారా క్షేత్ర స్థాయి అధికారులు పేపర్ పట్టుకుని ఉన్నతాధికారుల చుట్టూ, స్టోర్ చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. ఈ సమయాన్ని ఇతర పనులకు వెచ్చించొచ్చు. అదే విధంగా వ్యయప్రయాసాలు తగ్గుతాయి. ఈ –స్టోర్ విధానంలో పేపర్ ప్రస్తావన ఉండదు. మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. సమయానికి మెటీరియల్ చేతికి రావడం ద్వారా పనులు వేగంగా జరుగుతాయి. మెటీరియల్ కోసం ఎదురుచూపులు తగ్గుతాయి.
ఆన్లైన్ ద్వారా బుకింగ్..
గంటల్లో పనులు పూర్తి
టీజీ ఎన్పీడీసీఎల్లో
సాంకేతికతకు పెద్దపీట
పేపర్ పట్టుకుని అధికారుల
చుట్టు తిరిగే విధానానికి స్వస్తి
ఈ–స్టోర్.. ఈజీ
ఈ–స్టోర్.. ఈజీ