
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్రూరల్: మహబూబాబాద్ మున్సి పాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామ శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ తిరుపతిరా వు తెలిపారు. మహబూబాబాద్ సబ్ డివిజన్ పో లీస్ అధికారి కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పార్థసారథి హత్య జరిగిన రోజున అతడి సోదరి హేమవరలక్ష్మి ఇచ్చిన ఫిర్యా దు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో మృతుడు పార్థసారథి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకటవిద్యాసాగర్ను గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారని తెలిపారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గంగ హుస్సేన్ బస్తీకి చెందిన తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తామని పేర్కొన్నారు. గతంలో పార్థసారథిని హత్య చేయాలని జరిగిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రాజాఓమంగి మండలం జెడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రూరల్, సీసీఎస్ సీఐలు సర్వయ్య, హత్తిరాం, రూరల్, కేసముద్రం ఎస్సైలు దీపిక, మురళీధర్ రాజు పాల్గొన్నారు.