
మంట వేడికి కోళ్లు మృత్యువాత
శాయంపేట : మండలంలోని ఆరెపల్లి శివారులో మొక్కజొన్న సొప్ప కాలుతూ పౌల్ట్రీ ఫామ్ పక్కకు అంటుకోగా ఆ మంట వేడికి లక్షలాది రూపాయల విలువైన కోళ్లు మృత్యువాత పడ్డాయి. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పరకాల రాజేందర్ ఆరెపల్లి గ్రామ శివారులో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ ఫామ్ పక్కన గంగుల పులమ్మ వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని శాయంపేటకు చెందిన దుంపల రాజిరెడ్డి కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోసిన తర్వాత ఎండిన సొప్పను మంగళవారం తగులబెట్టగా కాలుతూ పౌల్ట్రీ ఫామ్ పక్కకు అంటుకుంది. మంట వేడికి సుమారు 1,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ రూ.4లక్షల 50వేలు ఉంటుంది. ఈ ఘటనపై రాజేందర్.. రాజిరెడ్డిని పెద్దమనుషుల ద్వారా అడిగించగా.. ‘నా భూమిలో సొప్ప కాల్చుకున్నా.. మంట మీ దగ్గరకు వస్తే మీరే ఆర్పుకోవాలి.. నాకు సంబంధం లేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. కాగా, రాజిరెడ్డికి తన చేనులోకి వెళ్లడానికి దారి లేదని, తాము కొన్నిసార్లు తమ పౌల్ట్రీ ఫామ్ నుంచి వెళ్లొద్దని చెప్పామని, దీంతో మనస్సులో పెట్టుకుని కావాలనే మక్క సొప్పను తగులబెట్టి కోళ్లు మృత్యువాత పడేలా చేశాడని రాజేందర్ ఆరోపించాడు.
రూ. 4. 50 లక్షల నష్టం
ఆరెపల్లి శివారులోని
పౌల్ట్రీ ఫామ్లో ఘటన