
‘మత్తు’ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి, హశీష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి, సుమారు రూ.25 లక్షల విలువైన 2 కిలోల హశీష్ ఆయిల్, మూడు సెల్ఫోన్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన సుధాకర్, కోటగిరి సాయివినయ్ అలియాస్ వినయ్ 2023లో తన స్నేహితుడు వరుణ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి వెళ్లి గంజాయి తీసుకొస్తుండగా డొంకరాయి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడ (జైలు) ములుగుకు చెందిన లావుడ్యా రవీందర్కు తాను గంజాయి అమ్ముకుంటానని చెప్పాడని పేర్కొంటూ ఇటీవల సుధాకర్పై దాడిచేయగా సాయి వినయ్పై హనుమకొండ పీఎస్లో కేసు నమోదైంది. అనంతరం సాయి వినయ్ను ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలించగా అక్కడ హరి, కబీర్ సింగ్ ఇద్దరు పరిచయమై సాయి వినయ్ ఫోన్ నంబర్ తీసుకున్నారు. మూడు వారాల క్రితం హరి.. సాయివినయ్కి ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని చెప్పాడు. దీనిని సిగరెట్లకు పూసి తాగితే కిక్కు వస్తుందని, ఇది కిలో రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని చెప్పి తన అన్న రామ్మూర్తి ద్వారా ఆ ఆయిల్ను వరంగల్ రైల్వే స్టేషన్లో అందజేయగా సాయివినయ్ ఇంట్లో దాచాడు. పది రోజుల క్రితం ములుగు జిల్లా జగ్గన్నపేట అన్నంపల్లి తండాకు చెందిన ఆటో డ్రైవర్ లావుడ్యా రవీందర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన గుగులోత్ హరిసింగ్.. 12 కిలోల ఎండు గంజాయి తీసుకుని సాయి వినయ్కు ఇవ్వగా దానిని కూడా తన ఇంట్లో దాచాడు. అనంతరం సాయి వినయ్.. రవీందర్కు ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని తెలుపగా రవీందర్, హరిసింగ్ మంగళవారం ఆటోలో సాయివినయ్ ఇంటికి వచ్చారు. అనంతరం ఇద్దరు ఆటోలో, ఒకరు బైక్పై వెళ్తుండగా రెడ్డికాలనీ ప్రాంతంలో పోలీసులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా గంజాయి, హశీష్ ఆయిల్ లభించడంతో ముగ్గురిని అరెస్ట్ రిమాండ్కు తరలించామని, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ షేక్ సలీమా తెలిపారు.
10 కిలోల గంజాయి, 2 కిలోల హశీష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ షేక్ సలీమా