
తగ్గని చికెన్ ధరలు
మెదక్ పట్టణం ఆటోనగర్లోని ఓ చికెన్ సెంటర్లో బర్డ్ఫ్లూ వైరస్కు (రెండు నెలల) ముందు నిత్యం 10 క్వింటాళ్ల చికెన్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం రోజుకు క్వింటాల్ చికెన్ మాత్రమే విక్రయిస్తున్నారు. గతంలోనూ కిలో చికెన్ ధర రూ. 180 పలకగా, ప్రస్తుతం దాని ధర రూ. 210కి చేరింది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 90 శాతం చికెన్ విక్రయాలు పడిపోయాయి. అయినా ధర ఏ మాత్రం తగ్గలేదు.
– మెదక్జోన్
ఎన్ని అవాంతరాలు ఎదురైనా బ్రాయిలర్ కోడి ధర తగ్గేదేలే అంటోంది. మొన్నటి వరకు బర్డ్ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ భారీగా పతనమైన విషయం తెలిసిందే. భారీ నష్టాలతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి దూరం అయ్యారు. దీంతో డిమాండ్కు తగిన సప్లై లేక ఈ మధ్య చికెన్ ధర అమాంతం పెరిగింది. రెండు నెలల క్రితం చికెన్ అంటేనే జనం జంకే పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో కిలో చికెన్ ధర రూ.150కు పడిపోయింది. బర్డ్ఫ్లూ భయం పోగొట్టేందుకు ఫాల్ట్రీ యజమానులు చికెన్ వంటకాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అయినా మార్కెట్ పుంజుకోలేదు. జిల్లావ్యాప్తంగా 3 వేల పైచిలుకు కోళ్ల ఫారాలు ఉండగా, వీటి ఆధారంగా వేలాది మంది రైతులతో పాటు కూలీలు జీవనం సాగిస్తున్నారు. కాగా ఫిబ్రవరిలో బర్డ్ఫ్లూ కలకలం రేపటంతో చాలా వరకు చికెన్ తినడం మానేశారు. ఇక మార్చిలో అంతుచిక్కని వైరస్తో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మార్కెట్లో చికెన్ విక్రయాలు తగ్గటంతో సదరు కంపెనీకి చెందిన నిర్వాహకులు సైతం వాటిని ఫారాల్లోనే వదిలేశారు. దీంతో కోళ్ల ఫారం నిర్వాహకులు వైరస్ సోకిన కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టారు. అయితే పలు కంపెనీల నిర్వాహకులు కోడి పిల్లలతో పాటు దాణను సమకూరుస్తారు. కోళ్లను పెంచిన ఫౌల్ట్రీ రైతుకు వాటి బరువును బట్టి కమీషన్ ఇస్తుంటారు. కాగా 2 నెలలుగా కోళ్లు చనిపోవటంతో పోషకులకు కమీషన్ ఇవ్వడం మానేశారు. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు.
కోడి పిల్లలు తీసుకోండి..
బర్డ్ఫ్లూతో సుమారు 2 నెలల పాటు కోళ్ల ఫారాలు కూనరిల్లాయి. ఇక వైరస్ పోయింది.. కోడి పిల్లలను తీసుకోవాలని సదరు కంపెనీల నిర్వాహకులు కోళ్లపెంపకం దారులను కోరుతున్నట్లు తెలిసింది. అయితే ఒక బ్యాచ్ కోళ్లు పెరగాలంటే 50 నుంచి 55 రోజుల గడువు పడుతుండటంతో అప్పటిలోగా పూర్తిగా సమసిపోతాయని రైతులకు నచ్చచెబుతున్నారు. అయినప్పటికీ రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రజల్లో పూర్తిస్థాయిలో భయం పోయి చికెన్ తినటం ప్రారంభించినప్పుడే కోళ్లను పెంచటం మంచిదని భావిస్తున్నట్లు తెలిసింది.
బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో కోళ్ల పరిశ్రమలకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో 90 శాతం చికెన్ విక్రయాలు తగ్గాయి. అయితే చికెన్ ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. మార్చిలో రంజాన్ నేపథ్యంలో కిలో చికెన్ ధర రూ. 280 పలికింది. హలీం తయారీ కోసం చికెన్ ఎక్కువగా ఉపయోగించటంతో చికెన్ ధర భారీగా పెరిగిందని పలువురు చెబుతున్నారు. అయితే వారం రోజులుగా కాస్త ధర తగ్గి ప్రస్తుతం కిలో ధర రూ. 210 పలుకుతోంది.