
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అఖండలో మాదిరే ఈ సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో సీనియర్ హీరోయిన్ మీనా కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య ఫ్లాష్బ్యాక్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో బాలకృష్ణకు జోడీగా మీనా కనిపించనున్నారట. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతోందని సమాచారం. ఇక మెయిన్ హీరోయిన్గా శృతిహాసన్ నటించబోతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి.
ఇక మీనా విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.